Crude Oil: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు మళ్లీ మండిపోతున్నాయి. బుధవారం ఉదయం జరిగిన ట్రేడింగ్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఏకంగా 3 శాతం మేర పెరిగాయి. చమురు ధరలు ఇలా వరుసగా రెండో రోజు కూడా పెరగడం గమనార్హం. ఇరాన్పై అమెరికా సైన్యం జరిపిన దాడులు, కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు దారితీయడమే ఇందుకు ప్రధాన కారణమని రాయిటర్స్ నివేదిక స్పష్టం చేసింది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులకు తెగబడటంతో.. దానికి ప్రతిస్పందనగా మంగళవారం అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ సైనిక స్థావరాలపై పలు దాడులు చేసినట్లు ప్రకటించింది. ఈ తాజా భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్ను ఒక్కసారిగా వేడెక్కించాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ ముడి చమురు బ్యారెల్కు 76 డాలర్ల మార్కును అధిగమించిందని డేటా చూపిస్తోంది. బుధవారం, గల్ఫ్ ముడి చమురు ట్రేడింగ్ సెషన్లో 76.25 డాలర్ల మార్కును దాటి, దాదాపు 3 శాతం పెరిగి బ్యారెల్కు 76.09 డాలర్లకు చేరుకుంది. జూలై 6న, బ్రెంట్ ముడి చమురు ధరలు బ్యారెల్కు 72 డాలర్ల కంటే తక్కువగా ముగిశాయి. అదే సమయంలో, యూఎస్ ముడి చమురు ధరలు కూడా పెరిగాయి. జూలై 6 నుంచి WTI ధరలు బ్యారెల్కు దాదాపు 4 డాలర్లు పెరిగి, 72.50 డాలర్ల మార్కును అధిగమించాయని డేటా చూపిస్తోంది. ప్రస్తుతం, ధరలు దాదాపు 3 శాతం పెరిగి బ్యారెల్కు 72.37 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
ధరలు ఎందుకు పెరిగాయంటే..
వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు జరిపిన నేపథ్యంలో, ఆ దేశం ముడి చమురు అమ్మకాలను అనుమతించే సాధారణ లైసెన్సును అమెరికా రద్దు చేయడంతో ప్రస్తతం అంతర్జాతీయ మార్కెట్లో వాటి ధరలు పెరిగాయి. వాణిజ్య నౌకలపై దాడులకు ఇరాన్ కారణమని ఖతార్ ఆరోపించింది. ఈ దాడులకు గురైన నౌకలలో ఖతార్కు చెందిన ట్యాంకర్ ‘అల్ రెకాయత్’ కూడా ఉంది. డ్రోన్ దాడి కారణంగా ఆ నౌక ఇంజన్ రూమ్లో మంటలు చెలరేగాయి. అయితే ప్రస్తుతం సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ఖతార్ తెలిపింది. సౌదీ జెండా కలిగిన ‘వెడయాన్’ అనే సూపర్ట్యాంకర్ కూడా ఒమన్ సమీపంలో దెబ్బతిన్నట్లు సమాచారం. నౌక నష్టానికి గల కారణం స్పష్టంగా తెలియరాలేదు.
భారతదేశంలో పెట్రోల్ – డీజిల్ ధరలు
అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతానికి భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదని క్రేందం స్పష్టం చేసింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలలో చివరిసారిగా మార్పు వచ్చింది, అది ఇంధన ధరల పెరుగుదలే జరిగినప్పుడే అని వెల్లడించింది. తాజా ఐఓసీఎల్ డేటా ప్రకారం.. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు వరుసగా రూ.102.12, రూ.95.20గా ఉన్నాయి. కోల్కతాలో రూ.113.51, రూ.99.82గా ఉంది. ముంబైలో రూ.111.21, రూ. 97.83గా ఉన్నాయి. చెన్నైలో రూ.107.77, రూ.99.55కు చేరింది. అయితే మే నెలలో ఇంధన ధరలు 7 నుంచి 8 శాతం మేర పెరిగాయి. రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గవని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు స్థిరపడే వరకు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు.

