UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ

  • UPI యూజర్లకు గుడ్ న్యూస్
  • రూ.2,000 వరకు లావాదేవీలపై ఎలాంటి ఫీజు లేదు
Upi Refund Process

Upi Refund Process

UPI Payment Charges Waived Up to rs2,000: UPI వినియోగించే కోట్లాది మంది భారతీయులకు శుభవార్త. రూ.2,000 వరకు చేసే UPI లావాదేవీలపై ఎలాంటి ఫీజు లేదా ఛార్జీలు వసూలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. చిన్న వ్యాపారులు, దుకాణదారులకు కూడా ఈ నిర్ణయం ఉపశమనం కలిగించనుంది. అంతేకాదు, RuPay డెబిట్ కార్డు ద్వారా రూ.2,000 వరకు చేసే లావాదేవీలు కూడా పూర్తిగా ఉచితంగా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ

UPI, RuPay డెబిట్ కార్డు ద్వారా రూ.2,000 వరకు చేసే చెల్లింపులపై ఫీజుల వసూలును నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గెజిట్ నోటిఫికేషన్ అనేది ప్రభుత్వం జారీ చేసే అధికారిక ప్రకటన. దీనికి చట్టపరమైన ప్రాధాన్యత కూడా ఉంటుంది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన

పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 (2007లోని చట్టం 51)లోని సెక్షన్ 10A ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. ఈ నిబంధనల ప్రకారం, RuPay డెబిట్ కార్డు, UPI ద్వారా రూ.2,000 వరకు చెల్లింపులు చేసే లేదా స్వీకరించే వ్యక్తులపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ఛార్జీలు విధించకూడదని బ్యాంకులు, సిస్టమ్ ప్రొవైడర్లను ప్రభుత్వం ఆదేశించింది.

UPI చెల్లింపులపై బ్యాంకులు, యాప్‌లు ఫీజు వసూలు చేయలేవు

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, రూ.2,000 వరకు చేసే UPI లావాదేవీలపై డబ్బులు పంపే వ్యక్తి లేదా డబ్బులు స్వీకరించే వ్యక్తి నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదు. బ్యాంకులు, ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వంటి చెల్లింపు సేవల ప్రొవైడర్లు ఈ లావాదేవీలపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఛార్జీలు విధించరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో చిన్న మొత్తాల్లో డిజిటల్ చెల్లింపులు చేసే వినియోగదారులకు, UPI ద్వారా డబ్బులు స్వీకరించే చిన్న వ్యాపారులకు ప్రయోజనం కలగనుంది.

RuPay డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్లు కూడా ఫ్రీ

UPIతో పాటు RuPay డెబిట్ కార్డు ద్వారా రూ.2,000 వరకు చేసే లావాదేవీలపైనా ఎలాంటి ఫీజు వసూలు చేయరాదు. డెబిట్ కార్డు ద్వారా చెల్లింపు చేసే వ్యక్తి, డబ్బులు స్వీకరించే వ్యక్తి ఇద్దరి నుంచి కూడా బ్యాంకులు లేదా సిస్టమ్ ప్రొవైడర్లు ఛార్జీలు వసూలు చేయలేరు.

వినియోగదారులకు ప్రయోజనం

రూ.2,000 వరకు UPI లావాదేవీలపై ఫీజు ఉండదు.
రూ.2,000 వరకు RuPay డెబిట్ కార్డు చెల్లింపులు ఉచితం.
డబ్బులు పంపేవారు, స్వీకరించేవారిపై ప్రత్యక్ష, పరోక్ష ఛార్జీలకు నిషేధం.
చిన్న వ్యాపారులు, దుకాణదారులకు డిజిటల్ చెల్లింపుల్లో ఉపశమనం.