N Chandrasekaran: టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత మరోసారి చైర్మన్గా నియమితులయ్యేందుకు తాను ఆసక్తి చూపడం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే 2027 ఫిబ్రవరి 20 వరకు ప్రస్తుత పదవీకాలంలో కొనసాగుతానని వెల్లడించారు. దీంతో టాటా గ్రూప్ తదుపరి చైర్మన్ ఎవరనే అంశంపై ఆసక్తి నెలకొంది.
చంద్రశేఖరన్ 1987లో టాటా గ్రూప్లో చేరారు. 2009లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2017లో టాటా సన్స్ చైర్మన్గా నియమితులయ్యారు. ప్రస్తుతం టాటా సన్స్ ఆధ్వర్యంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా మోటార్స్, ఎయిర్ ఇండియా సహా 30కి పైగా కంపెనీలు ఉన్నాయి. చంద్రశేఖరన్ ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగియనుంది. ఆ తర్వాత మరో ఐదేళ్ల కాలానికి ఆయనను కొనసాగించాలని సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్లు ఏకగ్రీవంగా సిఫారసు చేశాయి. ఈ ప్రతిపాదనను టాటా సన్స్ నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ, బోర్డు కూడా పరిశీలించి సిఫారసు చేశాయి.
అయితే ఫిబ్రవరి 24న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఒక బోర్డు సభ్యుడు మద్దతు ఇవ్వకపోవడంతో నిర్ణయం ముందుకు సాగలేదు. అప్పటి నుంచి ఆరు నెలలు గడిచినా దీనిపై ఏకాభిప్రాయం కుదరలేదని చంద్రశేఖరన్ తెలిపారు. ఏకగ్రీవ మద్దతు లేని పరిస్థితిలో పునర్నియామకంపై నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నానని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. టాటా సన్స్ ఆధ్వర్యంలో ప్రస్తుతం పలు కీలక వ్యూహాత్మక ప్రాజెక్టులు కీలక దశలో ఉన్నందున నాయకత్వంపై ముందుగానే స్పష్టత ఉండటం అవసరమని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో తన పదవీకాలం ముగిసిన తర్వాత పునర్నియామకం కోసం తన పేరును ప్రతిపాదించకూడదని నిర్ణయించుకున్నట్లు టాటా సన్స్ బోర్డుకు చంద్రశేఖరన్ తెలియజేశారు. అలాగే తన వారసుడిని వీలైనంత త్వరగా ఎంపిక చేసి, నాయకత్వ మార్పు సజావుగా జరిగేలా చూడాలని బోర్డును కోరారు. చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా సన్స్, టాటా ట్రస్ట్స్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. టాటా సన్స్లో 66% వాటా టాటా ట్రస్ట్స్దే. టాటా గ్రూప్లోని కీలక కంపెనీలపై టాటా సన్స్ నియంత్రణ కలిగి ఉంది.
చంద్రశేఖరన్ 40 ఏళ్లుగా టాటా గ్రూప్తో అనుబంధం కలిగి ఉన్నారు. 2017లో టాటా సన్స్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 2027 ఫిబ్రవరిలో ప్రస్తుత పదవీకాలాన్ని పూర్తి చేసిన తర్వాత వైదొలగనున్నారు.

