Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు వారం ప్రారంభంలోనే గట్టి షాక్ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ సూచీలు సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే కుప్పకూలాయి. మార్కెట్ ప్రారంభం కావడంతోనే అమ్మకాల ఒత్తిడి తీవ్రం కావడంతో.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ ఏకంగా 800 పాయింట్లకు పైగా పతనమైంది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 250 పాయింట్లకు పైగా క్షీణతను నమోదు చేస్తూ ట్రేడింగ్ను కొనసాగిస్తోంది.
చెల్లాచెదురైన దిగ్గజ షేర్లు
మార్కెట్లలో నెలకొన్న ఈ భారీ క్షీణత కారణంగా అగ్రశ్రేణి కంపెనీల షేర్లు తీవ్ర నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా.. పవర్ గ్రిడ్, టాటా స్టీల్, మారుతి సుజుకి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్, టైటాన్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు భారీగా పతనమై ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేస్తున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లను విక్రయించడమే మార్కెట్ పతనానికి ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
