Reliance Bonds: దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశీయ డెట్ మార్కెట్లో భారీ ఫండ్ రైజింగ్కు రెడీ అవుతోంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ దాదాపు మూడేళ్ల విరామం తర్వాత భారత రూపాయి బాండ్ మార్కెట్లోకి తిరిగి అడుగుపెడుతోంది. ఆయిల్ నుంచి టెలికాం వరకు విస్తరించిన కంపెనీ వ్యాపారాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా భారీగా నిధులు సమీకరించే వ్యూహాన్ని రూపొందించినట్లు సమాచారం. మర్చంట్ బ్యాంకర్ల సమాచారం ప్రకారం.. ఈ బాండ్ ఇష్యూ ఇటీవలి కాలంలో దేశీయ కార్పొరేట్ బాండ్ మార్కెట్లో జరిగిన అతిపెద్ద నిధుల సమీకరణల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.
ఐదేళ్ల బాండ్లతో రూ.12,500 కోట్ల సేకరణ
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐదేళ్ల కాలవ్యవధి కలిగిన బాండ్లను జారీ చేయడం ద్వారా సుమారు రూ.12,500 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఈ బాండ్లపై ఇన్వెస్టర్లకు ఏడాదికి 7.47 శాతం వడ్డీ అందించే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. ఈ ఇష్యూ కోసం సంస్థాగత, అర్హత కలిగిన ఇతర ఇన్వెస్టర్ల నుంచి బిడ్లను స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేటెడ్ నాన్ – ఫైనాన్షియల్ కంపెనీ ఒకేసారి ఇంత భారీ మొత్తాన్ని సమీకరించడం నవంబర్ 2023 తర్వాత ఇదే తొలిసారి కావచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశీయ బాండ్ మార్కెట్లోకి రిలయన్స్ తిరిగి రావడం వెనుక కీలకమైన కారణం రుణ వ్యయం అని సమాచారం. ఇటీవలి నెలల్లో భారత్లో ఐదేళ్ల కాలవ్యవధి బాండ్ల యీల్డ్ తగ్గుముఖం పట్టింది. జూన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఐదేళ్ల ప్రభుత్వ బాండ్ యీల్డ్లో సుమారు 33 బేసిస్ పాయింట్ల తగ్గుదల నమోదైంది. మరోవైపు అమెరికాలో ట్రెజరీ యీల్డ్స్ అధిక స్థాయిలో కొనసాగుతున్నాయి. దీంతో భారతీయ కంపెనీలు డాలర్లలో రుణాలు తీసుకోవడం ఖరీదైన వ్యవహారంగా మారింది. భారత్లో రూపాయిల్లో నిధులు సమీకరించడం తక్కువ వ్యయంతో కూడుకున్న మార్గంగా మారడంతో రిలయన్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అరేంజర్లుగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు..
ఈ భారీ బాండ్ ఇష్యూకు దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు అరేంజర్లుగా వ్యవహరించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ బ్యాంకులు స్వయంగా కూడా బాండ్లలో కొంత భాగాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్ల బాండ్ ఇష్యూతో పాటు దీర్ఘకాలిక రుణాలపై కూడా రిలయన్స్ దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇందులో భాగంగా 10 ఏళ్ల మెచ్యూరిటీ కలిగిన బాండ్లను కూడా జారీ చేసే అవకాశాన్ని కంపెనీ పరిశీలిస్తోందట. ఇందుకు సంబంధించి బ్యాంకర్లు, పెద్ద ఇన్వెస్టర్లతో చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. దేశీయ రుణ మార్కెట్లో రిలయన్స్ రీఎంట్రీ భారీ నిధుల సమీకరణకు తెరతీయడంతో పాటు కార్పొరేట్ బాండ్ మార్కెట్పై కూడా గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.

