Petrol Diesel Price Hike: మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, హార్వర్డ్ ప్రొఫెసర్ గీతా గోపీనాథ్ హెచ్చరించారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగవచ్చని, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని, రూపాయి విలువ కూడా పడిపోవచ్చని ఆమె స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చితే, ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతినే అవకాశముందని గీతా గోపీనాథ్ తెలిపారు. ఈ ప్రభావం భారతదేశంపై తీవ్రంగా పడవచ్చని, దేశం ఇంధన ధరల పెరుగుదలతో పాటు ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి మందగమనం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చని ఆమె పేర్కొన్నారు.
చమురు నుంచి ఎరువుల వరకు ప్రభావం
ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన గీతా గోపీనాథ్, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రపంచ సరఫరా గొలుసును ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. చమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ, ఎరువుల సరఫరాపై కూడా ఈ సంక్షోభం ప్రభావం చూపుతోందన్నారు. ధరలు పెరగడమే కాకుండా, కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం ఇంధన అవసరాల కోసం మధ్యప్రాచ్య దేశాలపై ఎక్కువగా ఆధారపడుతుండటంతో, ఈ పరిస్థితి దేశానికి మరింత సవాలుగా మారుతుందని ఆమె తెలిపారు. ఇది కేవలం ధరల సమస్య మాత్రమే కాకుండా, సరఫరా అంతరాయాలకు కూడా దారితీసే ప్రమాదం ఉందని చెప్పారు.
హార్మూజ్ జలసంధి ఉద్రిక్తతలు పెరిగితే..
ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్లలో ఆందోళన నెలకొంది. ఒకవేళ సరఫరా అంతరాయాలు కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు 140 డాలర్ల వరకు చేరే అవకాశం ఉందని గీతా గోపీనాథ్ హెచ్చరించారు. జూన్ వరకు ఇదే పరిస్థితి కొనసాగితే, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారే అవకాశముందని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ముడి చమురు ధరల పెరుగుదల భారతదేశంలో నేరుగా పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపుతుందని చెప్పారు.
పెట్రోల్-డీజిల్ ధరలు మరింత పెరగొచ్చు
ముడి చమురు ధరలు పెరిగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం తప్పదని గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. ప్రభుత్వం కొంత మేర ఆర్థిక లోటును భరించాల్సి రావచ్చని, అయితే దాని ప్రభావం ప్రజలు, కంపెనీలపై పడే అవకాశం ఉందన్నారు. ఇంధన ధరల పెరుగుదల కారణంగా దేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. రోజువారీ అవసరాల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు.
రూపాయి విలువపై కూడా ఆందోళన
రూపాయి విలువ కూడా మరింత క్షీణించే ప్రమాదం ఉందని గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. ఫిబ్రవరిలో అమెరికన్ డాలర్తో పోలిస్తే సుమారు 91 వద్ద ఉన్న రూపాయి విలువ ఇప్పుడు 97 ప్రాంతానికి చేరుకుందని తెలిపారు. అయితే రూపాయి 100 మార్క్ను దాటుతుందా అనే అంశంపై అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఉపాధి, ద్రవ్యోల్బణం, ఉత్పత్తి వంటి అంశాలపైనే ప్రధాన దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. ప్రస్తుతం పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థలో పలు రంగాలు బలంగా ఉన్నాయని, తీవ్రమైన ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు తక్కువేనని గీతా గోపీనాథ్ తెలిపారు.
