ఖరీదైన టికెట్లు కొనుగోలు చేసి విమానాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు సౌకర్యాలు ఎంత బాగుండాలి. అలాంటిది ఫ్లైట్లో వడ్డించిన ఆహారంలో బొద్దింక ప్రత్యక్షం కావడంతో ఎయిరిండియా విమానంలో తీవ్ర కలకలం రేగింది. ప్రయాణికుడు భారత విమానాయాన శాఖకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా అందుకు సంబంధించిన చిత్రాలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
ఓ విదేశీ ప్రయాణికుడి కుటుంబం ఢిల్లీ నుంచి న్యూయార్క్కు ఎయిరిండియా విమానంలో వెళ్తున్నారు. అయితే విమానంలో అందించిన ఆహారం తింటుండగా సడన్గా ఆమ్లెట్లో బొద్దింక ప్రత్యక్షం అయింది. దీంతో ప్రయాణికురాలు ఎయిరిండియా సిబ్బందికి ఫిర్యాదు చేసింది. రెండేళ్ల చిన్నారితో కలిసి సగం తినేశాక బొద్దింక కనబడిందని తెలిపింది. దీంతో ఫుడ్ పాయిజన్ అయిందని ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ 17న ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడికి కూడా ఫిర్యాదు చేశారు. ఎయిర్ ఇండియా, ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA మరియు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని ట్యాగ్ చేస్తూ… విమానంలో అందించిన ఆహార పదార్థాల వీడియో మరియు ఫోటోలను కూడా ఆమె పంచుకున్నారు.
ఆహారంలో బొద్దింక ప్రత్యక్షం కావడంపై ఎయిరిండియా ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. తమ క్యాటరింగ్ సర్వీస్ ప్రొవైడర్తో కలిసి సమస్యను పరిశోధిస్తున్నట్లు ఎయిర్లైన్ పేర్కొంది. దర్యాప్తు చేయడానికి క్యాటరింగ్ సర్వీస్ ప్రొవైడర్తో కలిసి పనిచేస్తోందని ప్రతినిధి తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటాయని చెప్పారు.