ONGC Share: మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ కూటమి ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో విరుచుకుపడటం.. దానికి ప్రతిస్పందనగా ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతుండగా, భారత స్టాక్ మార్కెట్లోని ఒక ప్రభుత్వ రంగ దిగ్గజానికి మాత్రం ఇది ‘కాసుల వర్షం’ కురిపించబోతోంది. ఇంతకీ ఆ షేర్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Israel-Iran War: దుబాయ్ పామ్ జుమైరాపై ఇరాన్ క్షిపణి దాడి..
యుద్ధ వాతావరణం వల్ల స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుంటే, చమురు అన్వేషణ, ఉత్పత్తి రంగంలో ఉన్న ONGC (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) షేర్లు మాత్రం రాకెట్ లాగా దూసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు పెరిగినప్పుడు, చమురును భూమి, సముద్ర గర్భం నుండి వెలికితీసే కంపెనీలకు భారీ లాభాలు వస్తాయి. ఎందుకంటే ONGC తన ఉత్పత్తి ఖర్చులో పెద్దగా మార్పు లేకుండానే, వెలికితీసిన చమురును అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలకు విక్రయించగలుగుతుంది. దీనివల్ల కంపెనీ ఆదాయం, లాభ మార్జిన్లు గణనీయంగా పెరుగుతాయి. అందుకే సోమవారం మార్కెట్ ప్రారంభం కాగానే ఇన్వెస్టర్లు ONGC వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
గత కొంతకాలంగా ONGC స్టాక్ మార్కెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోందని అంటున్నారు. గత ఏడాది ఈ కంపెనీ వృద్ధి సుమారు 23.91% పెరుగుదల నమోదు చేసిందని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటికే 17.30% లాభాలను నమోదు చేసిందని వెల్లడించారు. స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్ ప్రస్తుత ధర రూ.279 వద్ద ఉండగా, త్వరలోనే తన 52 వారాల గరిష్ట స్థాయి రూ.282.50 ని దాటి కొత్త రికార్డులను సృష్టించే దిశగా పయనిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి చమురు ధరల పెరుగుదల అందరికీ శుభవార్త కాదని, స్టాక్ మార్కెట్లో కూడా దీని ప్రభావం రెండు రకాలుగా ఉంటుందని అంటున్నారు. చమురు ధరల వల్ల ONGC, ఆయిల్ ఇండియా వంటి చమురు ఉత్పత్తి కంపెనీలు లాభపడిన, IOCL, BPCL, HPCL వంటి కంపెనీలు నష్టపోతాయని చెప్పారు. ఎందుకంటే ఇవి ముడి చమురును కొనుగోలు చేసి శుద్ధి చేస్తాయి కాబట్టి, ముడి చమురు ధర పెరిగితే వీటి లాభాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. యుద్ధ వాతావరణం వల్ల మార్కెట్లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.
