NTV Telugu Site icon

Sam Altman: మాట్లాడితే ప్రతీకారం ఉంటుందని “ముస్లింలు” భయపడుతున్నారు..

Sam Altman

Sam Altman

Sam Altman: ఒపెన్ఏఐ చీఫ్ సామ్ ఆల్ట్‌మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్-గాజా యుద్ధం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. టెక్ పరిశ్రమలో ముస్లిం, అరబ్ కమ్యూనిటీ సభ్యులు ఇటీవల తన అనుభవాల గురించి మాట్లాడేందుకు అసౌకర్యంగా ఉన్నారని ఆయన గురువారం అన్నారు. ‘‘ టెక్ కమ్యూనిటీలో ముస్లిం, అరబ్(ముఖ్యంగా పాలస్తీనియన్స్) సహోద్యోగులు కెరీర్ అవకాశాలు దెబ్బతింటాయని, ప్రతీకార చర్యలు ఉంటాయనే భయంతో ఇటీవల కాలంలో వారి అనుభవాల గురించి మాట్లాడేందుకు అసౌకర్యంగా ఉన్నారు.’’ అంటూ ఎక్స్(ట్విట్టర్)లో ఆల్ట్‌మాన్ వ్యాఖ్యానించారు. ఉద్యోగుల మద్దతుతో మన పరిశ్రమ ఐక్యంగా ఉండాలి, నిజమైన శాశ్వతమైన శాంతి కోసం ఆశిస్తున్నానని అన్నారు.

Read Also: Gyanvapi mosque case: నేడు జ్ఞాన్‌వాపీ మసీదులో సర్వే నివేదిక బహిర్గతంపై తుది తీర్పు

తాను యూదుడినని, యాంటి సెమిటిజం అనేది ప్రపంచంలో ఒక ముఖ్యమైన, పెరుగుతున్న సమస్య అని నమ్ముతున్నానని, మా పరిశ్రమలో చాలా మంది వ్యక్తులు నాకు మద్దతుగా నిలిచారని, దానికి నేను ఎంతో అభినందిస్తున్నానని అన్నారు. అయితే ముస్లిం కమ్యూనిటీకి మద్దతు లేకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. జూయిష్ కమ్యూనిటీ అనుభవాలను, ఆల్ట్‌మాన్ దృక్పథాన్ని ఎక్స్‌లో యూజర్ ప్రశ్నించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అక్టోబర్ 7న పాలస్తీనా హమాస్ ఇజ్రాయిల్‌పై దాడి చేసింది. దీని తర్వాత ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రారంభమైంది. ఇటీవల కాలంలో అమెరికాలో సెమిటిజం, ఇస్లామోఫోబియా భయాలు పెరిగాయి. అమెరికాలో ఇస్లామోఫోబియా, పాలస్తీనియర్లు, అరబ్బుల పట్ల పక్షపాత ధోరణి సంఘటనలు 172 శాతం పెరిగినట్లు కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ నివేదించింది. ఇజ్రాయిల్‌‌పై హమాస్ జరిపిన దాడుల్లో 1200 మంది మరణించారు. ఇజ్రాయిల్ దాడుల్లో 20 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు.