Mukesh Ambani: షేర్ మార్కెట్ ‘సూపర్ కింగ్’గా ముకేశ్ అంబానీ.. అంబానీ తదుపరి టార్గెట్ అదేనా?

  • జియో లిస్టింగ్‌తో సరికొత్త చరిత్ర
  • రూ. 35,000 కోట్లకు పైగా ఐపీఓ సైజ్..
  • ఐపీఓ పేపర్స్ సబ్‌మిట్ చేసిన అంబానీ
Mukesh Ambani

Mukesh Ambani

Mukesh Ambani: ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ సృష్టించబోతున్న సంచలనం అంతా ఇంతా కాదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దలాల్ స్ట్రీట్‌లో ‘కింగ్’గా వెలుగుతున్న రిలయన్స్.. రాబోయే ‘రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్’ (Jio) ఐపీఓ లిస్టింగ్‌తో ‘సూపర్ కింగ్’ హోదాను అందుకోబోతోందని చెబుతున్నారు. ఇది కేవలం అంచనా మాత్రమే కాదని, జియో మార్కెట్ లిస్టింగ్ కోసం సిద్ధమవుతున్న భారీ వాల్యూయేషన్ గణాంకాలే దీనికి నిదర్శనం. స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవ్వడమే ఆలస్యం.. జియో దేశంలోనే రెండవ అత్యంత విలువైన కంపెనీగా అవతరించబోతోందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

దేశంలోనే టాప్-2 కంపెనీలు అంబానీవే..

ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో లిస్ట్ అయిన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రిలయన్స్ గ్రూప్ వాటా 4 శాతంగా ఉంది. అయితే జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ తర్వాత ఈ వాటా ఏకంగా 7 శాతానికి పెరగనుంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం.. జియో ప్లాట్‌ఫామ్స్ గరిష్ట వాల్యూయేషన్ సుమారు రూ.14 లక్షల కోట్లుగా ఉండబోతోందని సమాచారం. దీనితో ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ గ్రూప్.. మార్కెట్ క్యాప్ పరంగా దేశంలోనే అతిపెద్ద రెండు కంపెనీలను సొంతం చేసుకున్నట్లవుతుంది.

×
×
Ad

మొదటి స్థానం: రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) – మార్కెట్ క్యాప్ రూ.17.7 లక్షల కోట్లు

రెండవ స్థానం: జియో ప్లాట్‌ఫామ్స్ (Jio) – అంచనా మార్కెట్ క్యాప్ రూ.14 లక్షల కోట్లు

జియో ఊహించిన విధంగా ఈ మార్కెట్ క్యాప్‌తో లిస్ట్ అయితే.. ప్రస్తుతం మార్కెట్‌లో దిగ్గజాలుగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (రూ.12 లక్షల కోట్లు), భారతి ఎయిర్‌టెల్ (రూ.11.6 లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్ (రూ.9.7 లక్షల కోట్లు) వంటి సంస్థలను వెనక్కి నెట్టి రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్‌ఫామ్స్ ల సంయుక్త మార్కెట్ విలువ సుమారు రూ.32 లక్షల కోట్లు దాటనుంది. ఈ విలువ ప్రస్తుత హెచ్‌డీఎఫ్‌సీ, ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంకుల ఉమ్మడి మార్కెట్ విలువకు (రూ.33 లక్షల కోట్లు) దాదాపు సమానం. ప్రస్తుతం బిఎస్‌ఇ మొత్తం మార్కెట్ క్యాప్ రూ.478 లక్షల కోట్లుగా ఉండగా, నిఫ్టీ 50 కంపెనీల మార్కెట్ విలువ రూ.194 లక్షల కోట్లుగా ఉంది. ఈ లెక్కన బెంచ్‌మార్క్ సూచీ మొత్తం మార్కెట్ విలువలో ఒక్క రిలయన్స్ గ్రూప్ వాటాయే 16% కంటే ఎక్కువగా ఉండబోతుండటం గమనార్హం.

గ్లోబల్ మార్కెట్‌లో ఎలాన్ మస్క్‌తో పోలిక..

అంతర్జాతీయ మార్కెట్‌తో పోల్చి చూస్తే.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా, స్పేస్‌ఎక్స్ కంపెనీల ఉమ్మడి వాటా అమెరికా మార్కెట్ క్యాప్‌లో కేవలం 5 శాతంగానే ఉంది. నాస్‌డాక్‌లో స్పేస్‌ఎక్స్ మార్కెట్ క్యాప్ $2.4 ట్రిలియన్లకు, టెస్లా మార్కెట్ క్యాప్ $1.3 ట్రిలియన్లకు చేరినప్పటికీ.. అమెరికా మొత్తం మార్కెట్ విలువ ($77 ట్రిలియన్లు) భారీగా ఉండటమే ఇందుకు కారణం. అయితే కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో టెక్నాలజీ కంపెనీల హవా మరింత ఎక్కువగా ఉంది. దక్షిణ కొరియా మార్కెట్ క్యాప్‌లో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, ఎస్కే హైనిక్స్ కంపెనీల వాటా దాదాపు 50% కాగా, తైవాన్ దేశ మార్కెట్ క్యాప్‌లో ప్రముఖ చిప్‌మేకర్ ‘టీఎస్‌ఎంసీ’ (TSMC) వాటా ఏకంగా 40% పైగా ఉంది. ఆ దేశాల తరహాలోనే ఇప్పుడు భారత స్టాక్ మార్కెట్‌ను ముకేశ్ అంబానీ ఒంటిచేత్తో శాసించే రోజులు దగ్గరపడ్డాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.