MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్కే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోనూ తన ప్రభావాన్ని మరింత విస్తరిస్తున్నారు. ఇప్పటికే పలు స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టిన ధోనీ.. తాజాగా రూఫ్టాప్ సోలార్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న SolarSquare అనే స్టార్టప్లో పెట్టుబడి పెట్టారు. తన ఫ్యామిలీ ఆఫీస్ Midas Deals ద్వారా ఈ పెట్టుబడి పెట్టిన ధోనీ, అదే సమయంలో ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరించనున్నారు. అయితే కంపెనీలో ఆయన పెట్టుబడి మొత్తం ఎంత అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
ఈ పెట్టుబడి ఇటీవల SolarSquare సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన 53 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.510 కోట్లు) విలువైన Series C Funding లో భాగం. ఈ ఫండింగ్ రౌండ్కు ప్రముఖ ఇన్వెస్టర్ Lightspeed నాయకత్వం వహించగా, Lowercarbon Capital, Rainmatter, Good Capital వంటి సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టాయి. భారతదేశంలో రూఫ్టాప్ సోలార్ మార్కెట్ భవిష్యత్తుపై తమకు ఉన్న నమ్మకానికి ధోనీ భాగస్వామ్యం నిదర్శనమని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త నిధులతో SolarSquare తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుందని చెప్పింది. ప్రస్తుతం సేవలు అందిస్తున్న నగరాలకు తోడు, మరో 30 నుంచి 40 కొత్త నగరాల్లోకి విస్తరించాలని కంపెనీ వ్యూహాలను రూపొందించింది. అలాగే టెక్నాలజీ ప్లాట్ఫామ్ను మరింత బలోపేతం చేయడం, వినియోగదారులకు సులభమైన ఫైనాన్సింగ్ సదుపాయాలు కల్పించడం, కస్టమర్ సపోర్ట్ను మెరుగుపరచడం, కొత్త ఉద్యోగులను నియమించడం వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టనున్నట్లు చెబుతుంది.
2015లో శ్రేయా మిశ్రా, నీరజ్ జైన్, నిఖిల్ నహర్ కలిసి స్థాపించిన SolarSquare తొలుత వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు సేవలు అందించింది. అనంతరం 2021లో గృహ వినియోగదారుల కోసం రూఫ్టాప్ సోలార్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం సంస్థ కన్సల్టేషన్ నుంచి డిజైన్, ఇన్స్టాలేషన్, ఫైనాన్సింగ్, నిర్వహణ వరకు పూర్తి స్థాయి సేవలను అందిస్తోంది. ఇప్పటివరకు దేశంలోని 29 నగరాల్లో 50,000కుపైగా ఇళ్లలో రూఫ్టాప్ సోలార్ సిస్టమ్లను ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. అలాగే ఇప్పటి వరకు 100 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు సమీకరించగా, సంస్థ వార్షిక ఆదాయ రన్రేట్ (ARR) దాదాపు రూ.1,000 కోట్లకు చేరుకుంది. భారతదేశంలో రూఫ్టాప్ సోలార్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు, ప్రభుత్వ సబ్సిడీలు, స్వచ్ఛమైన ఇంధనంపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన ఈ రంగానికి ఊతమిస్తున్నాయని విశ్లేషకలు. దేశంలోని సుమారు 7 కోట్ల ఇళ్లలో రూఫ్టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని SolarSquare అంచనా వేస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 2030 నాటికి భారత క్లీన్టెక్ మార్కెట్ 152 బిలియన్ డాలర్ల అవకాశంగా మారే ఛాన్స్ ఉంది. కాగా 2026లో ధోనీ పెట్టిన మూడో స్టార్టప్ పెట్టుబడి ఇదే కావడం విశేషం. అంతకుముందు ఆయన Kuku, LightFury Games వంటి స్టార్టప్లలో కూడా పెట్టుబడులు పెట్టారు. ఇటీవల రోహిత్ శర్మ, అజింక్య రహానే, రియాన్ పరాగ్ వంటి భారత క్రికెటర్లు కూడా స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపార రంగంలో తమ ముద్ర వేస్తున్నారు.

