అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, యూఎస్ బాండ్ల రాబడులు పటిష్టమవ్వడం, డాలర్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడటం వంటి కారణాల వల్ల భారత రూపాయి విలువ చారిత్రాత్మక పతనాన్ని చూసింది. ట్రేడింగ్లో రూపాయి డాలర్తో పోలిస్తే రూ. 96.85 వద్ద ప్రారంభమై, రికార్డు స్థాయిలో రూ. 96.96 ఆల్-టైమ్ కనిష్టానికి పడిపోయింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి రూ. 96.83 వద్ద స్థిరపడింది. ఆర్బీఐ జోక్యం చేసుకోవడం వల్ల రూపాయికి కొంత ఉపశమనం లభించింది. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి ఆర్బీఐ బహుముఖ చర్యలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇవి చర్చల దశలోనే ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి.. ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ డిపాజిట్లను మళ్లీ ప్రారంభించడం, ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేక బాండ్లను జారీ చేయడం, మరిన్ని రూపాయి-డాలర్ బై/సెల్ స్వాప్ లావాదేవీలను నిర్వహించడం అనేవి ఆర్బీఐ చేపడుతున్న చర్యల్లో భాగంగా ఉన్నాయి.
బ్యాంకింగ్ వ్యవస్థలోకి నిధులను చేర్చడానికి, విదేశీ మారక నిల్వలను సమర్థవంతంగా నిర్వహించడానికి ఆర్బీఐ ఒక కీలక ప్రకటన చేసింది. మే 26న ఉదయం 10:30 నుంచి 11:30 గంటల మధ్య 5 బిలియన్ డాలర్ల విలువైన బై/సెల్/స్వాప్ వేలం నిర్వహించనుంది. ఈ స్వాప్ కాలపరిమితి మూడు సంవత్సరాలు ఉంటుంది. ఇది ఆర్బీఐ వైపు నుంచి “సింపుల్ బై/సెల్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ స్వాప్” రూపంలో ఉంటుంది. ఇందులో భాగంగా వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న యూఎస్ డాలర్లను ఆర్బీఐకి విక్రయించి, రూపాయిలను పొందుతాయి. అదే సమయంలో.. మూడేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత అదే మొత్తంలో డాలర్లను తిరిగి కొనుగోలు చేయడానికి ఆర్బీఐతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఈ చర్యల ద్వారా మార్కెట్లో రూపాయి విలువను స్థిరీకరించేందుకు కేంద్ర బ్యాంక్ ప్రయత్నిస్తోంది.
