Site icon NTV Telugu

Indian Rupee: ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి.. తొలిసారిగా 93 మార్కును దాటిన డాలర్! సామాన్యుడిపై ప్రభావం ఎంతంటే

Indian Rupee

Indian Rupee

Indian Rupee: భారత కరెన్సీ రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రికార్డు స్థాయి పతనాన్ని చవిచూసింది. శుక్రవారం ట్రేడింగ్‌లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తొలిసారిగా 93 మార్కును దాటి సరికొత్త కనిష్ట స్థాయికి పడిపోయింది. ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

READ ALSO: Iran Vs Israel War: ఒకే యుద్ధం.. మూడు కథలు.. మూడు నిజాలు..! ఇరాన్ గెలవబోతుందా?

రికార్డు కనిష్ట స్థాయిలు ఇలా..
బుధవారం రూపాయి 92.89 వద్ద ముగియగా, గురువారం గుడి పడ్వా సందర్భంగా మార్కెట్లకు సెలవు ప్రకటించారు. శుక్రవారం మార్కెట్ ప్రారంభం కాగానే రూపాయి 19 పైసలు క్షీణించి 93.08 వద్ద ట్రేడవుతోంది. రూపాయి మరింత పతనం కాకుండా భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) డాలర్లను విక్రయిస్తూ రంగంలోకి దిగినప్పటికీ, ఒత్తిడి మాత్రం తగ్గడం లేదు. ఆరు ప్రధాన కరెన్సీల బాస్కెట్‌తో పోలిస్తే డాలర్ బలాన్ని తెలిపే ‘డాలర్ ఇండెక్స్’ 0.17 శాతం పెరిగి 100.25 వద్దకు చేరింది.

రూపాయి విలువ ఎందుకు తగ్గుతుందంటే..
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు $107 వద్ద కొనసాగుతున్నాయి. ఇది భారత్ వంటి దిగుమతి చేసుకునే దేశాల కరెన్సీపై భారాన్ని పెంచుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. మార్చి నెలలో ఇప్పటివరకు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారత మార్కెట్ల నుంచి సుమారు 8 బిలియన్ డాలర్లకు పైగా వెనక్కి తీసుకున్నారు. జనవరి 2025 తర్వాత ఇదే అతిపెద్ద ఉపసంహరణ కావడం గమనార్హం.

సామాన్యుడిపై ప్రభావం ఎంత?
రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతుల వ్యయం పెరుగుతుంది. దీనివల్ల దేశంలో ‘దిగుమతి ద్రవ్యోల్బణం’ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చమురు దిగుమతులు ఖరీదైనవిగా మారి, ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల ఫీజులు, విదేశీ పర్యటనలకు వెళ్లే వారి ఖర్చులు భారీగా పెరుగుతాయని వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ వంటి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు కూడా పెరగవచ్చని అభిప్రాయపడుతున్నారు.

స్టాక్ మార్కెట్ ఆశలు..
మరోవైపు, దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం సానుకూలంగా స్పందించాయి. సెన్సెక్స్ 960 పాయింట్లు పెరిగి 75,167 వద్ద, నిఫ్టీ 311 పాయింట్ల లాభంతో 23,313 వద్ద కొనసాగుతున్నాయి. మార్కెట్లు లాభాల్లో ఉండటం రూపాయి మరీ దారుణంగా పడిపోకుండా కొంతవరకు అడ్డుకోగలిగిందని అంటున్నారు. భవిష్యత్తులో చమురు సరఫరా మెరుగుపడితే తప్ప రూపాయికి ఇప్పుడప్పుడే ఉపశమనం లభించేలా లేదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

READ ALSO: Dhurandhar 2: ధురందర్ 2 లో ఊహించని క్లైమాక్స్‌.. పార్ట్ 3 ఉంటుందా?

Exit mobile version