Indian Stock Market: గత వారం దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, అగ్రశ్రేణి కంపెనీలు మాత్రం ఇన్వెస్టర్ల సంపదను భారీగా పెంచాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఓ దశలో కుప్పకూలి, మరుసటి రోజే అనూహ్యంగా పుంజుకోవడంతో మార్కెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచాయి. గత ఐదు ట్రేడింగ్ రోజుల్లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (సెన్సెక్స్) 0.22 శాతం లాభాన్ని నమోదు చేయగా.. టాప్-10 కంపెనీల్లో ఆరు సంస్థలు ఏకంగా రూ.63,478 కోట్ల సంపదను ఆర్జించాయి.
గత వారం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన సంస్థల్లో లార్సెన్ & టూబ్రో (L&T) అగ్రస్థానంలో నిలిచింది. కేవలం ఐదు రోజుల్లోనే ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.28,523 కోట్లు పెరిగి, మొత్తం రూ.6.02 లక్షల కోట్లకు చేరింది. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ (SBI) సైతం దూసుకుపోయింది. ఈ బ్యాంక్ ఇన్వెస్టర్లు సుమారు రూ.16,015 కోట్లు ఆర్జించగా, దీని మార్కెట్ క్యాప్ రూ.11.22 లక్షల కోట్లకు చేరింది. అలాగే హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ విలువ రూ.9,617 కోట్లు వృద్ధి చెంది రూ.14.03 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది.
లాభాల్లో రిలయన్స్, ఎల్ఐసీ
దేశీయ దిగ్గజ సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ఐసీలు కూడా లాభాల బాటలోనే పయనించాయి. ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ.5,977 కోట్లు పెరిగి, రూ.5.52 లక్షల కోట్లకు చేరింది. అలాగే బజాజ్ ఫైనాన్స్ రూ.3,142 కోట్ల వృద్ధిని నమోదు చేసింది. ఇదే సమయంలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ స్వల్పంగా రూ.202 కోట్లు పెరిగినప్పటికీ, రూ.19.21 లక్షల కోట్లతో దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా తన నంబర్ 1 స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
నష్టపోయిన ఐటీ, టెలికాం దిగ్గజ సంస్థ ఇవే..
ఈ 5 రోజుల్లో ఆరు కంపెనీలు లాభాల్లో దూసుకుపోగా, మరో నాలుగు దిగ్గజ సంస్థలు మాత్రం నష్టాలను చవిచూశాయి. ముఖ్యంగా టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ మార్కెట్ విలువ రూ.15,338 కోట్లు ఆవిరైపోయింది. ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ రూ.14,632 కోట్ల నష్టాన్ని నమోదు చేయగా, ఐటీ రంగానికి చెందిన ఇన్ఫోసిస్ రూ.6,791 కోట్లు, టీసీఎస్ రూ.1,989 కోట్ల మేర మార్కెట్ విలువను కోల్పోయాయి.
టాప్-10 దిగ్గజ సంస్థలు ఇవే..
ప్రస్తుతం మార్కెట్ విలువ పరంగా దేశంలో టాప్-10 స్థానాల్లో ఉన్న కంపెనీలు ఇవే.. 1.రిలయన్స్ ఇండస్ట్రీస్, 2. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, 3. భారతీ ఎయిర్టెల్, 4. ఎస్బీఐ, 5. ఐసీఐసీఐ బ్యాంక్, 6. టీసీఎస్, 7. బజాజ్ ఫైనాన్స్, 8. ఎల్అండ్టీ, 9. ఎల్ఐసీ, 10. ఇన్ఫోసిస్.
READ ALSO: T20 World Cup 2026: సూపర్ 8 ఆడకుండానే సెమీస్లోకి భారత్.. ఎలాగో తెలుస్తే షాక్ అవుతారు!
