Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Why Indian Rupee Hits Record Low Against US Dollar-Explained: భారత కరెన్సీ ‘రూపీ’ (Rupee) విలువ అంతర్జాతీయ మార్కెట్లో మునుపెన్నడూ లేనంతగా దిగజారుతోంది. బుధవారం నాటి ట్రేడింగ్లో అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ సరికొత్త జీవితకాల కనిష్ట స్థాయి అయిన 96.81కి పడిపోయింది. రాబోయే రోజుల్లో ఇది మరింత క్షీణించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, రూపాయి విలువ పడిపోవడం అనేది మన దేశంలో ఎప్పుడూ ఒక సున్నితమైన, రాజకీయపరమైన అంశంగానే మారుతుంటుంది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో (ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికాల వైమానిక దాడులతో ఫిబ్రవరి 28న ప్రారంభమైన) జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారతదేశంపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. భారత్ రోజుకు సుమారు 55 లక్షల (5.5 మిలియన్) బ్యారెళ్ల ముడి చమురును వినియోగిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర పెరిగిన ప్రతిసారీ దేశం నుంచి అదనంగా డాలర్లు బయటకు తరలిపోతున్నాయి.
ఇలాంటి క్లిష్ట సమయంలో పాలసీల కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఎక్కువవుతోంది. రూపాయి విలువ క్షీణించడంపై కాంగ్రెస్తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శల బాణాలు గురిపెడుతున్నాయి. సాధారణంగా కరెన్సీ మార్కెట్లో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలను (Forex Reserves) ఉపయోగించి జోక్యం చేసుకుంటుంది. ప్రస్తుతం భారత్ వద్ద 697 బిలియన్ డాలర్ల భారీ విదేశీ నిల్వలు ఉన్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి విలువను కాపాడటానికి ఆర్బీఐ తన వద్ద ఉన్న విలువైన డాలర్లను ఖర్చు చేయకపోవడమే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవీస్ ఈ అంశంపై మాట్లాడుతూ.. “ప్రస్తుత మార్కెట్ అంచనాల ప్రకారం ఆర్బీఐ రూపాయి విలువను మార్కెట్ శక్తులకే వదిలేసేలా కనిపిస్తోంది. ఎందుకంటే రూపాయి బలహీనపడితే ఎగుమతులకు లాభం చేకూరుతుంది, అలాగే దిగుమతులు సహజంగానే తగ్గుతాయి” అని పేర్కొన్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయ ఆర్థికవేత్త, ఐఎంఎఫ్ మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ కూడా ‘లెట్ ద రూపీ డూ ఇట్స్ వర్క్’ (రూపాయిని తన పని తాను చేసుకోనివ్వండి) అనే వ్యాసంలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఆర్బీఐ బలవంతంగా రూపాయిని కాపాడటానికి పూనుకోనంత వరకు భారత్ విదేశీ నిల్వలు కరిగిపోవని ఆమె అభిప్రాయపడ్డారు.
Also Read
- Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- CNG Price Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన CNG ధరలు.. కొత్త రేట్లు ఇవే!
- Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
- Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
రూపాయి బలహీనపడటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ ఎగుమతులకు డిమాండ్ పెరుగుతుంది. కానీ, ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా చేసుకునే భారతదేశానికి ఇది దేశీయంగా ధరల పెరుగుదలకు (ద్రవ్యోల్బణం) దారితీస్తుంది. ఉదాహరణకు, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రూపాయి విలువ 5% పడిపోయింది. అంటే మనం దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు లేదా మొబైల్ చిప్స్ ధర 5% పెరుగుతుందని, ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ వివరించారు. అయితే ఇందులో ఒక సానుకూల అంశం కూడా ఉంది. దిగుమతి వస్తువుల ధరలు, విదేశీ ప్రయాణాల ఖర్చులు పెరగడం వల్ల ప్రజలు సహజంగానే పొదుపు పాటించడం మొదలుపెడతారు. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ సైతం భారతీయులు ఇంధనాన్ని ఆదా చేయాలని, అనవసరమైన విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని, బంగారం కొనుగోళ్లను నియంత్రించాలని కోరారు. తద్వారా దేశం నుంచి డాలర్లు బయటకు పోకుండా కాపాడుకోవచ్చు.
రూపాయి మరింత పడిపోతుందా?
ఇక, ప్రస్తుతం ఆసియాలోనే అత్యంత అధ్వాన్నమైన ప్రదర్శన కనబరుస్తున్న కరెన్సీగా రూపాయి నిలిచింది. మరి ఇది 100 మార్కును కూడా దాటేస్తుందా? అనే ప్రశ్నకు.. మధ్యప్రాచ్యంలో యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే దానిపైనే చమురు ధరలు, రూపాయి కదలికలు ఆధారపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 70-80 డాలర్ల నుంచి ఇప్పుడు 100 డాలర్లు దాటిపోయింది. భారత్ తన ఇంధన అవసరాల కోసం 85% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. చమురు ధర బ్యారెల్కు 10 డాలర్లు పెరిగినా.. భారత్పై రోజుకు 50 మిలియన్ డాలర్ల అదనపు భారం పడుతుంది. దేశంలో ఎన్నికల కారణంగా చమురు కంపెనీలు రెండు నెలల పాటు ధరలను పెంచకుండా నిలిపివేసినప్పటికీ, ఇటీవల రెండు విడతల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను రూ. 3.90 మేర పెంచాయి. అయితే రూపాయి విలువ పడిపోవడం వల్ల వచ్చిన నష్టాలు, ఈ ధరల పెంపు ద్వారా చమురు కంపెనీలకు (OMCs) వచ్చిన స్వల్ప ఉపశమనాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తున్నాయని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. 2025లో ఆర్బీఐ మార్కెట్లో జోక్యం చేసుకుని రూపాయిని కృత్రిమంగా స్థిరపరిచినప్పటికీ, ఇప్పుడు మాత్రం దాన్ని ఒక షాక్ అబ్జార్బర్లా వదిలేయడానికే మొగ్గు చూపుతోంది.
అసలు సమస్య ఇక్కడే..
రూపాయి పతనం అనేది దేశ ఆర్థిక పునాదుల్లోని లోపాలను సైతం ఎత్తిచూపుతోంది. దేశంలోకి వచ్చే విదేశీ పెట్టుబడుల (Inflows) కంటే దేశం నుంచి బయటకు వెళ్లే నిధులు (Outflows) ఎక్కువగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలు చమురు ధరలు పెరగడం, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు (FPIs) తమ నిధులను వెనక్కి తీసుకోవడం. భారతదేశం ఎప్పుడూ దిగుమతులు ఎక్కువగా చేసుకోవడం వల్ల కరెంట్ అకౌంట్ లోటులోనే ఉంటుంది. కానీ ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ (పెట్టుబడుల ప్రవాహం) కూడా లోటులోకి వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. 2026లో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు (FPIs) భారత మార్కెట్లలో దాదాపు 22.4 బిలియన్ డాలర్ల విలువైన షేర్లు, బాండ్లను విక్రయించి సొమ్మును వెనక్కి తీసుకున్నారు. ఇతర దేశాలలో మెరుగైన అవకాశాలు ఉండటం, భారత మార్కెట్లలో కొన్ని రంగాలు ఓవర్ వాల్యూ చేయబడ్డాయనే భావన ఉండటమే ఇందుకు కారణం. దీనికి తోడు, భారతీయ కంపెనీలు సైతం స్వదేశంలో కాకుండా విదేశీ మార్కెట్లలో భారీగా (సుమారు $30-35 బిలియన్లు) పెట్టుబడులు పెడుతున్నాయి. దేశీయంగా వినియోగ వృద్ధి అంతగా లేకపోవడమే ఇందుకు కారణం కావచ్చు. అయితే దీనివల్ల డాలర్లను ఆదా చేయాలనే ప్రభుత్వ సంకల్పానికి గండిపడుతుండటంతో, ఆర్బీఐ ఈ విదేశీ పెట్టుబడులపై నిఘాను కఠినతరం చేసింది.
ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా అభిప్రాయం ప్రకారం.. 2017లో భారతదేశం తీసుకొచ్చిన కొన్ని కఠినమైన ఎఫ్డీఐ (FDI) నిబంధనల వల్ల కూడా విదేశీ పెట్టుబడిదారులు భారత్ వైపు చూడటం లేదు. ముఖ్యంగా 2017లో బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ (BITs) రద్దు చేసినప్పటి నుంచి ఎఫ్డీఐ రేట్లు తగ్గాయి. పెట్టుబడుల వివాదాలను అంతర్జాతీయ థర్డ్ పార్టీ వేదికలపై కాకుండా భారతదేశంలోనే పరిష్కరించుకోవాలనే నిబంధనలు పెట్టడం విదేశీ ఇన్వెస్టర్లను వెనకడుగు వేసేలా చేస్తోందట. చివరగా చెప్పాలంటే, పడిపోతున్న రూపాయికి ఆర్బీఐ సపోర్ట్ అవసరం లేకపోయినా.. ఈ పతనం వెనుక ఉన్న అసలు సమస్య విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించలేకపోవడం, స్వదేశీ కార్పొరేట్లు విదేశాలకు తరలిపోవడమని నిపుణులు చెబుతున్నారు. భారతదేశం తక్షణమే నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టి, దేశీయ ఉత్పత్తిని, వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయాల కంటే ఆర్థిక విధానాలకే ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం వచ్చేసిందని భావించాలి.
తాజావార్తలు
-
Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
-
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్తో హారర్ మూవీ?
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
-
Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
-
Race 4: ‘రేస్’ రీబూట్లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్తో అల్టిమేట్ యాక్షన్ ?
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!