Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం

  • చైనాకు భారత్ గట్టి షాక్
  • అల్యూమినియం ఫాయిల్‌పై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు
  • 'మేక్ ఇన్ ఇండియా'కు బలం
India Anti Dumping Duty On

India Anti Dumping Duty On

చైనా నుంచి చౌకగా దిగుమతి అవుతున్న అల్యూమినియం ఫాయిల్‌పై భారత ప్రభుత్వం మరోసారి కఠిన వైఖరిని ప్రదర్శించింది. దేశీయ పరిశ్రమల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, చైనా, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా దేశాల నుంచి దిగుమతి అయ్యే అల్యూమినియం ఫాయిల్‌పై విధిస్తున్న యాంటీ-డంపింగ్ సుంకాన్ని 2026 డిసెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం దేశీయ అల్యూమినియం తయారీ సంస్థలకు పెద్ద ఊరటనివ్వగా, చైనాకు గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆర్థిక మంత్రిత్వ శాఖ 2026 జూన్ 10న జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది. 2021 సెప్టెంబర్ 16న జారీ చేసిన నోటిఫికేషన్ నెం. 51/2021-కస్టమ్స్ (ADD) ను సవరిస్తూ ఈ పొడిగింపును అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం అమలులో ఉన్న యాంటీ-డంపింగ్ సుంకాన్ని ముందుగానే ఉపసంహరించుకోకపోతే లేదా సవరించకపోతే, అది 2026 డిసెంబర్ 15 వరకు కొనసాగుతుంది.

×
×
Ad

ఏ దేశాల నుంచి దిగుమతులపై ఈ సుంకం?

ఈ నిర్ణయం చైనా, ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ నాలుగు దేశాల నుంచి దిగుమతి అయ్యే అల్యూమినియం ఫాయిల్‌కు వర్తిస్తుంది. ఈ దేశాల నుంచి దిగుమతి అయ్యే 80 మైక్రాన్లు లేదా అంతకంటే తక్కువ మందం ఉన్న అల్యూమినియం ఫాయిల్ పై యాంటీ-డంపింగ్ సుంకం అమలులో ఉంటుంది.

DGTR సన్‌సెట్ రివ్యూ కొనసాగుతోంది

చౌక దిగుమతుల ప్రభావంపై దర్యాప్తు చేస్తున్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (DGTR) 2025 సెప్టెంబర్ 29న సన్‌సెట్ రివ్యూను ప్రారంభించింది. ఈ సమీక్ష ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. ప్రస్తుతం అమలులో ఉన్న సుంకాన్ని తొలగిస్తే దేశీయ పరిశ్రమ మరోసారి నష్టపోయే ప్రమాదం ఉందా అనే అంశాన్ని పరిశీలించడం. సమీక్ష ప్రక్రియలో భాగంగా, 2026 ఏప్రిల్ 28న విచారణ నిర్వహించగా, పరిశ్రమ ప్రతినిధులు, దిగుమతిదారులు, ఇతర వాటాదారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

దేశీయ కంపెనీల డిమాండ్ ఇదే

భారతీయ తయారీ సంస్థలు చౌక దిగుమతుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయని వాదించాయి. ముఖ్యంగా హిండాల్కో ఇండస్ట్రీస్ (Hindalco Industries), SRF Altech వంటి సంస్థలు యాంటీ-డంపింగ్ సుంకాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరాయి. విదేశాల నుంచి తక్కువ ధరలకు వస్తున్న అల్యూమినియం ఫాయిల్ కారణంగా దేశీయ ఉత్పత్తిదారులు పోటీలో వెనుకబడుతున్నారని, స్థానిక పరిశ్రమల మనుగడకు ముప్పు ఏర్పడుతోందని అవి పేర్కొన్నాయి.

యాంటీ-డంపింగ్ సుంకం అంటే ఏమిటి?

ఒక దేశం తన ఉత్పత్తులను మరో దేశంలో అసాధారణంగా తక్కువ ధరలకు విక్రయించడం ద్వారా అక్కడి స్థానిక పరిశ్రమలను దెబ్బతీసే పరిస్థితిని ‘డంపింగ్’ అంటారు. ఇలాంటి అన్ ఫెయిర్ పోటీని అరికట్టేందుకు దిగుమతి ఉత్పత్తులపై అదనపు పన్ను విధించడాన్ని యాంటీ-డంపింగ్ సుంకంగా పిలుస్తారు. దీని ద్వారా దేశీయ తయారీదారులకు రక్షణ లభిస్తుంది.

‘మేక్ ఇన్ ఇండియా’కు బలం

ప్రభుత్వ తాజా నిర్ణయం దేశీయ అల్యూమినియం పరిశ్రమకు మద్దతుగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే, చౌక దిగుమతులను నియంత్రించడం ద్వారా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మరింత బలం చేకూరనుంది. అంతేకాకుండా, విదేశీ కంపెనీల అన్ ఫెయిర్ ధరల వ్యూహాల నుంచి భారతీయ పరిశ్రమలను రక్షించేందుకు ఇది కీలక చర్యగా పరిగణిస్తున్నారు.