Income Tax: భారత్లో కుబేరుల సంఖ్య రోజురోజుకూ వేగంగా పెరుగుతోంది. రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ వార్షిక ఆదాయాన్ని వెల్లడించిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య అసెస్మెంట్ ఇయర్ (AY) 2025-26 నాటికి ఏకంగా 576కు చేరింది. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన అధికారిక గణాంకాల ద్వారా ఈ విషయం బయటపడింది. గతేడాది ఈ సంఖ్య 415గా ఉండేది. దేశంలో శతకోటీశ్వరుల సంఖ్య పెరుగుతోందా అని అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఐదేళ్ల క్రితం (AY 2021-22) లో రూ. 100 కోట్ల కంటే ఎక్కువ రాబడిని చూపించిన వారు కేవలం 142 మంది మాత్రమే ఉండేవారని, ఈ లెక్కన చూస్తే గడిచిన ఐదేళ్లలో దేశంలో అత్యధిక ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య ఏకంగా 300 శాతానికి పైగా పెరిగిందని తెలిపారు.
ఈ ఐదేళ్ల కాలంలో AY 2021-22లో 142గా ఉన్న ఈ సంఖ్య, AY 2022-23 నాటికి 301కి చేరి, AY 2023-24లో కొద్దిగా తగ్గి 284కు పడిపోయింది. ఆ తర్వాత AY 2024-25లో 415కు పెరిగి, AY 2025-26లో ఏకంగా 576కి చేరింది. అయితే, పార్లమెంట్లో బిలియనీర్లు అనే పదాన్ని ప్రస్తావించినప్పటికీ.. ప్రభుత్వం వద్ద ‘బిలియనీర్’ అనే పదానికి ఎలాంటి అధికారిక లేదా చట్టబద్ధమైన నిర్వచనం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 లేదా పాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 పరిధిలో దీనికి నిర్వచనం లేకపోవడంతో రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ ఆదాయాన్ని ఐటీఆర్ దాఖలు చేసిన ప్రాతిపదికనే వీరిని అత్యధిక ఆదాయ వర్గాలుగా పరిగణించినట్లు మంత్రి పేర్కొన్నారు. అలాగే, 2016 ఏప్రిల్ 1 నుంచి ‘వెల్త్-ట్యాక్స్ యాక్ట్, 1957’ రద్దయినందున, పన్ను చెల్లింపుదారుల మొత్తం సంపదకు సంబంధించిన లెక్కలను ప్రభుత్వం నిర్వహించడం లేదని వెల్లడించారు.
దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై స్పందిస్తూ.. తాజా గృహ వినియోగ వ్యయ సర్వే (HCES 2023-24)లోని గిని కోఎఫీషియంట్ డేటాను మంత్రి ఉటంకించారు. దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో గిని సూచీ 0.266 నుంచి 0.237కు, పట్టణ ప్రాంతాల్లో 0.314 నుంచి 0.284కు తగ్గిందని, అంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగ అసమానతల వ్యత్యాసం తగ్గుతోందని వివరించారు. అంతేకాకుండా 15 ఏళ్లు పైబడిన వారిలో నిరుద్యోగిత రేటు 2022లోని 3.6% నుంచి 2025 నాటికి 3.1%కి తగ్గిందని, నీతి ఆయోగ్ అంచనాల ప్రకారం 2013-14, 2022-23 మధ్య కాలంలో దాదాపు 24.82 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు.
ఆదాయ, సంపద అసమానతలను తగ్గించేందుకు ప్రభుత్వం బహుముఖ వ్యూహాలను అమలు చేస్తోంది. అత్యధిక ఆదాయం గడించే వారిపై సాధారణ ఆదాయ పన్నుతో పాటు అదనపు సర్ఛార్జ్లను విధించే ప్రోగ్రెసివ్ ట్యాక్స్ విధానాన్ని అమలు చేస్తోంది. దీనితో పాటు ఉపాధి కల్పన, స్టార్టప్లు, సహకార రంగాలు, మౌలిక సదుపాయాల కల్పనకు పన్ను మినహాయింపులు ఇస్తూనే.. పీఎం ఆవాస్ యోజన, పీఎం జన్ధన్ యోజన, పీఎం-కిసాన్, ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ వంటి సంక్షేమ పథకాల ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తోంది. ఐదేళ్లలో రూ. 100 కోట్లకు పైగా రాబడి చూపే పన్ను చెల్లింపుదారులు 300% పెరిగినప్పటికీ, సంపదకు సంబంధించిన అధికారిక డేటా లేకపోవడంతో భారతీయ కుబేరుల అసలు సంపద పరిమాణం ఎంతనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

