ఆదాయ పన్ను చెల్లించే వారికి ప్రభుత్వం ఓ బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 1.3 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు రావాల్సిన రూ.340 కోట్ల రూపాయల రీఫండ్ డబ్బులు ఆగిపోయాయి. దీనికి ప్రధాన కారణం వారి పాన్ కార్డ్ ఇంకా ఆధార్తో లింక్ కాకపోవడమే.
చట్టం ప్రకారం ప్రతి ఒక్కరూ తమ పాన్ నంబర్ను ఆధార్తో లింక్ చేయడం తప్పనిసరి. అలా చేయని వారి పాన్ కార్డ్ ‘ఇన్-ఆపరేటివ్’లోకి వెళ్లిపోతుంది. ఇలా జరిగినప్పుడు.. మీరు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసినా, మీకు రావాల్సిన రీఫండ్ డబ్బులను ప్రభుత్వం మీ ఖాతాలో వేయదు. ఆ డబ్బులను ప్రభుత్వం తన వద్దే ఉంచుకుంటుంది. మీరు మీ పాన్ కార్డును ఆధార్తో లింక్ చేసిన తర్వాతే ఆ డబ్బులు మీకు అందుతాయి.
Also Read:Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో ఈ వివరాలను తెలియజేశారు. జనవరి 1, 2026 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 9.25 కోట్ల మందికి పైగా ప్రజల పాన్ కార్డ్లు ఆధార్తో లింక్ అవ్వక పనిచేయడం లేదు. అంతేకాదు.. ఆలస్యంగా లింక్ చేసినందుకు గానూ ప్రభుత్వం జరిమానాల రూపంలోనే రూ.2,338 కోట్లకు పైగా వసూలు చేసింది.
పాన్ కార్డ్ పని చేయకపోతే, మీ ఆదాయంపై టీడీఎస్ (TDS) సాధారణం కంటే ఎక్కువగా (దాదాపు 20%) కోత విధిస్తారు. పాన్ కార్డ్ యాక్టివ్గా లేకపోతే పెద్ద మొత్తంలో నగదు జమ చేయడం లేదా విత్ డ్రా చేయడం కష్టమవుతుంది. ప్రస్తుతం ఆధార్-పాన్ లింక్ చేయడానికి రూ.1,000 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
రీఫండ్ పొందడం ఎలా..?
మీ రీఫండ్ ఆగిపోయి ఉంటే కంగారు పడనక్కర్లేదు. మీరు చేయాల్సిందల్లా వెంటనే ఇన్కమ్ టాక్స్ పోర్టల్లోకి వెళ్లి నిర్ణీత రుసుము చెల్లించి ఆధార్ను లింక్ చేయడమే. మీరు లింక్ చేసిన తర్వాత పాన్ కార్డ్ మళ్ళీ పని చేయడం ప్రారంభిస్తుంది.. అప్పుడు నిలిచిపోయిన మీ డబ్బులు మీ బ్యాంకు ఖాతాకు చేరతాయి.
కాబట్టి.. మీ పాన్ కార్డ్ స్టేటస్ను ఒకసారి చెక్ చేసుకొని.. లింక్ అవ్వకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయడం మంచిది. దీనివల్ల అనవసరమైన జరిమానాలు, డబ్బులు ఆగిపోవడం వంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు.