PhonePe: ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ‘ఫోన్పే’ (PhonePe) తన యూజర్స్కు షాక్ ఇస్తూ వ్యాలెట్ రూల్స్ను సవరించింది. కొత్త గైడ్లైన్స్ ప్రకారం.. ఎవరైనా యూజర్ వరుసగా 365 రోజుల పాటు (ఏడాది కాలం) తమ ఫోన్పే వ్యాలెట్ను ఉపయోగించకపోతే, వారిపై ‘ఇన్యాక్టివిటీ మెయింటెనెన్స్ ఫీజు’ (Inactivity Maintenance Fees) విధిస్తారు. ఈ రుసుము కింద రూ.100 వసూలు చేయనున్నారు.
ఫీజు ఎవరికి వర్తిస్తుందంటే..
ఏడాది కాలంగా ఫోన్పే వ్యాలెట్ ద్వారా ఎలాంటి లావాదేవీలు (Transactions) జరపని వారికి మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. కేవలం ఫోన్పే యాప్ ఓపెన్ చేసినా లేదా నేరుగా బ్యాంక్ ఖాతా ద్వారా యూపీఐ (UPI) పేమెంట్స్ చేసినా వ్యాలెట్ యాక్టివ్గా ఉన్నట్లు పరిగణించరు. ఈ ఛార్జీల నుంచి తప్పించుకోవాలంటే యూజర్స్ తమ వ్యాలెట్ ద్వారా కనీసం ఒక్క ట్రాన్సాక్షన్ అయినా చేయాల్సి ఉంటుంది.
15 రోజుల ముందే అలర్ట్ మెసేజ్..
యాప్ నుంచి ఈ మెయింటెనెన్స్ ఫీజును కట్ చేయడానికి 15 రోజుల ముందే యూజర్స్ మొబైల్కు ఒక అలర్ట్ మెసేజ్ పంపుతారు. వ్యాలెట్లో బ్యాలెన్స్ ఉంటే కంపెనీ నేరుగా రూ.100 కట్ చేసుకుంటుంది. ఒకవేళ వ్యాలెట్లో రూ.100 కంటే తక్కువ మొత్తం ఉంటే, ఉన్న మొత్తాన్ని పూర్తిగా మినహాయించుకుంటారు. అయితే, దీనివల్ల వ్యాలెట్ బ్యాలెన్స్ మైనస్లోకి (నెగటివ్) వెళ్లదని సంస్థ స్పష్టం చేసింది. ఫోన్పే తీసుకున్న ఈ కొత్త నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము అసలు వ్యాలెట్ ఫీచర్నే వాడకుండా, కేవలం డైరెక్ట్ బ్యాంక్ టు బ్యాంక్ యూపీఐ లావాదేవీలు మాత్రమే చేస్తున్నప్పుడు, ఇలాంటి ఛార్జీలు వసూలు చేయడం ఎంతవరకు న్యాయమని ఫోన్పే సంస్థను ప్రశ్నిస్తున్నారు.

