ఏప్రిల్ 2026 నెలను దేశీయ బంగారం, వెండి ధరలు భారీ పెరుగుదలతో ప్రారంభించాయి. ఏప్రిల్ 1న 24 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములపై ఏకంగా రూ. 19,700 పెరగగా, 22 క్యారెట్లపై రూ. 18,000, 18 క్యారెట్లపై రూ. 14,800 వరకు పెరుగుదల నమోదైంది. గత మార్చి నెలలో ధరలు భారీగా తగ్గినప్పటికీ.. కొత్త నెల ప్రారంభంలోనే ఈ స్థాయిలో పెరగడం విశేషం.
ప్రస్తుతం దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,51,480కి చేరింది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 1,38,850 వద్ద ఉంది. వెండి ధర కూడా ఇదే బాటలో పయనిస్తూ కిలోకు రూ. 5,000 పెరిగి రూ. 2.55 లక్షల మార్కును తాకింది. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ. 15,148 గా ఉంది.
ధరల పెరుగుదలకు కారణాలు..
అంతర్జాతీయంగా అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టవచ్చనే ఆశలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం వల్ల క్రూడాయిల్ ధరలు తగ్గే అవకాశం ఉండటం, కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచకపోవచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లను బంగారం వైపు మళ్లించాయి. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ.. సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం , వెండికి అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ పెరిగింది.
ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ (COMEX) లో బంగారం ఔన్సు ధర 4,700 నుంచి 4,750 డాలర్ల వద్ద, వెండి 74 నుంచి 76 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. పారిశ్రామిక లోహాలకు డిమాండ్ పెరగడం కూడా వెండి ధరలకు మద్దతునిస్తోంది. అయితే.. ఇరాన్ మరియు మధ్యప్రాచ్యంలోని పరిణామాలు భవిష్యత్తులో ధరల దిశను నిర్ణయించవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
