సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం వస్తే అందరూ సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారాన్ని కొంటారు. దీనివల్ల బంగారం ధరలు విపరీతంగా పెరుగుతాయి. కానీ, ప్రస్తుతం జరుగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధ సమయంలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. యుద్ధం తీవ్రమవుతున్నా బంగారం ధరలు తగ్గడం మార్కెట్ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు బంగారం ధర సుమారు 13 శాతం మేర తగ్గింది.
ఇతర మార్కెట్లతో పోలిక..
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. స్టాక్ మార్కెట్లు కూడా పడిపోయినప్పటికీ.. బంగారం అంతగా పెరగలేదు. అమెరికాలోని ఎస్ అండ్ పి 500 (S&P 500) మార్కెట్ 7 శాతం, నాస్డాక్ (Nasdaq) 8 శాతం తగ్గగా, బిట్కాయిన్ కేవలం 2 శాతం మాత్రమే తగ్గింది. కానీ బంగారం ధరలు ఇంత భారీగా పడిపోవడం ఒక వింత అని డాయిష్ బ్యాంక్ (Deutsche Bank) పరిశోధకులు పేర్కొన్నారు.
బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి.. ?
దీనికి ప్రధానంగా మూడు కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందులో ఒకటి యుద్ధానికి ముందే పెరిగిన ధరలు. జనవరి నెలలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. ఒకానొక దశలో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత ఏడాది కాలంలోనే బంగారం ధర 50 శాతం పైగా పెరిగింది. యుద్ధం మొదలవ్వక ముందే ధరలు విపరీతంగా పెరగడం వల్ల, ఇప్పుడు ఇన్వెస్టర్లు తమ లాభాలను వెనక్కి తీసుకుంటున్నారు. అంటే ఎక్కువ ధరకు బంగారం అమ్మి నగదును దగ్గర పెట్టుకుంటున్నారు.
వడ్డీ రేట్ల ప్రభావం..
అమెరికా ప్రభుత్వ బాండ్లు (Treasury Yields) ఇప్పుడు 4.45 శాతం వడ్డీని ఇస్తున్నాయి. బంగారం మీద మనకు ఎలాంటి వడ్డీ రాదు. కానీ ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెడితే మంచి వడ్డీ వస్తుంది. యుద్ధం వల్ల పెరిగే ధరలను నియంత్రించడానికి వడ్డీ రేట్లు ఇంకా పెరుగుతాయని ఇన్వెస్టర్స్ భావిస్తున్నారు. అందుకే బంగారం కంటే బాండ్లలో పెట్టుబడి పెట్టడానికే అందరూ మొగ్గు చూపుతున్నారు.
డాలర్ బలం..
సంక్షోభం వచ్చినప్పుడు కేవలం బంగారం వైపు మాత్రమే కాకుండా, అమెరికా డాలర్ వైపు కూడా పెట్టుబడిదారులు చూస్తారు. ప్రస్తుతం డాలర్ బలంగా ఉండటం వల్ల బంగారం డిమాండ్ తగ్గింది. ప్రస్తుతానికి ధరలు తగ్గుతున్నప్పటికీ, దీర్ఘకాలంలో బంగారం ఎప్పుడూ నమ్మకమైన పెట్టుబడేనని నిపుణులు చెబుతున్నారు. గత ఐదేళ్లలో బంగారం ధర సుమారు 160 శాతం పెరగడమే దీనికి నిదర్శనం.