Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..

Air India

Air India

ప్రయాణికులకు తక్కువ ధరలోనే విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు, టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ మంగళవారం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన కొన్ని దేశీయ రూట్లలో ఎకానమీ క్లాస్ ప్రయాణికుల కోసం సరికొత్తగా ‘బేసిక్’ ఫేర్ కేటగిరీని ప్రవేశపెట్టింది. తక్కువ బడ్జెట్‌తో ప్రయాణించాలనుకునే వారికి, ఎక్కువ ఆప్షన్లు కోరుకునే వారికి ఈ సరికొత్త ప్లాన్ ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.

ఈ బేసిక్ ఫేర్ కింద టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు 15 కిలోల చెక్-ఇన్ లగేజీ, 7 కిలోల క్యాబిన్ లగేజీ అనుమతితో పాటు విమానంలో ఉచితంగా టీ లేదా కాఫీ సర్వీస్ లభిస్తుంది. అయితే, మిగిలిన క్లాసుల్లాగా ఈ బేసిక్ టికెట్ ధరలో ఉచిత భోజన సదుపాయం మాత్రం ఉండదు. వినియోగదారుల విభిన్న అవసరాలు, ప్రాధాన్యతలను గుర్తించి, వారి బడ్జెట్‌కు అనుగుణంగా ఎయిర్ ఇండియా ఈ ప్రో-కన్స్యూమర్ విధానాన్ని తీసుకువచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

×
×
Ad

ఎయిర్ ఇండియా గతంలో (2024లో) ప్రవేశపెట్టిన వాల్యూ, క్లాసిక్, మరియు ఫ్లెక్స్ కేటగిరీలలో ఉచిత భోజనంతో పాటు ఇతర అదనపు సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ, ఈ కొత్త బేసిక్ ఫేర్ మాత్రం అదనపు సేవలను పక్కన పెట్టి, కేవలం తక్కువ ధరకే ప్రయాణాన్ని అందించే ప్రత్యామ్నాయంగా నిలవనుంది. ఒకవేళ బేసిక్ ఫేర్ ఎంచుకున్న ప్రయాణికులకు భోజనం కావాలనుకుంటే, వారు విమానం బయలుదేరడానికి 24 గంటల ముందే వెజిటేరియన్, నాన్-వెజిటేరియన్, జైన్ లేదా డయాబెటిక్ మీల్స్ ఆప్షన్లను డబ్బులు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ విమాన షెడ్యూల్‌లో మార్పులు జరిగితే ఈ ప్రీ-బుక్డ్ భోజనాన్ని తదుపరి విమానానికి బదిలీ చేస్తారు, లేదా అందుబాటులో లేకపోతే ఆ డబ్బును రీఫండ్ చేస్తారు.

ప్రస్తుతానికి ఈ బేసిక్ ఫేర్ కేటగిరీ కేవలం ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్, కస్టమర్ కేర్ సెంటర్ మరియు ఎయిర్‌పోర్ట్ టికెటింగ్ ఆఫీసుల వంటి డైరెక్ట్ ఛానెళ్ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది. ట్రయల్ రన్ లో భాగంగా దీనిపై వచ్చే కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించిన తర్వాత, అన్ని రూట్లలోనూ ఈ బేసిక్ ఫేర్ విధానాన్ని పూర్తిగా విస్తరించాలా వద్దా అనేదానిపై ఎయిర్ ఇండియా తుది నిర్ణయం తీసుకోనుంది.