ఎయిర్ ఇండియా సంస్థలో భారీ మార్పులకు కొత్త సీఈవో టెవోల్డే గెబ్రెమరియమ్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. భారీ నష్టాలను తగ్గించేందుకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ను Air Indiaలో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చర్చలు ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్నాయని, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉటంకిస్తూ నివేదికలు వెల్లడించాయి.
61 ఏళ్ల టెవోల్డే గెబ్రెమరియమ్ను ప్రధానంగా ఆయన గత అనుభవం ఆధారంగా ఎయిర్ ఇండియా CEOగా ఎంపిక చేశారు. గతంలో Ethiopian Airlines Groupను ఆఫ్రికాలో అతిపెద్ద, అత్యంత లాభదాయకమైన విమానయాన సంస్థలలో ఒకటిగా తీర్చిదిద్దిన అనుభవం ఆయనకు ఉంది. వివిధ విభాగాల అధికారులతో జరిగిన సమావేశాల్లో టెవోల్డే.. రెండు వేర్వేరు ఆపరేటింగ్ పర్మిట్లతో రెండు విమానయాన సంస్థలను ఎందుకు నిర్వహించాల్సి వస్తోందని మేనేజర్లను ప్రశ్నించినట్లు సమాచారం. ఒకే ఎయిర్లైన్ గ్రూప్గా పనిచేస్తే నియంత్రణ, నిర్వహణకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకోవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. Air India, Air India Expressలకు వేర్వేరు మేనేజ్మెంట్, ఇంజినీరింగ్, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది అవసరం లేకుండా చేయడం ద్వారా ఖర్చులు తగ్గించవచ్చని టెవోల్డే భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే Air India Express విలీనం ఇంకా చర్చల దశలోనే ఉంది. దీనిని అమలు చేయాలంటే సంస్థ సూపర్వైజరీ బోర్డు అనుమతి అవసరం. విలీనం జరిగినా Air India Express బ్రాండ్ పేరును కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఎయిర్ ఇండియా భారీ నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో టెవోల్డే వ్యయ నియంత్రణపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా సుమారు రూ.22,000 కోట్ల నష్టం నమోదు చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. నష్టాలను తగ్గించడం టాటా గ్రూప్కు కూడా కీలకంగా మారింది. మరోవైపు టాటా సన్స్లో చైర్మన్ పదవీకాలం పొడిగింపుపై అంతర్గత చర్చలు, సంస్థను లిస్ట్ చేయాలన్న నియంత్రణపరమైన ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి.
పలు సవాళ్లు..
ఎయిర్ ఇండియా కొత్త CEO ముందున్న సవాళ్లు అనేకం. పాకిస్థాన్ గగనతలాన్ని భారత విమానాలకు మూసివేయడం, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా విమాన ప్రయాణాలపై ప్రభావం పడటం, ఇంధన వ్యయాలు పెరగడం వంటి అంశాలు సంస్థపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇదే సమయంలో ఎయిర్ ఇండియా విమానంలో ఆకస్మికంగా ఎత్తు తగ్గిన ఘటనకు సంబంధించిన దర్యాప్తులో.. ఆ విమాన పైలట్ డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్గా తేలినట్లు కూడా నివేదికలు పేర్కొన్నాయి.
ఎయిర్ ఇండియా గతంలోనూ విలీన ప్రక్రియను ఎదుర్కొంది. 2007లో Indian Airlinesతో Air India విలీనం జరిగింది. అనంతరం 2022లో టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన తర్వాత సంస్థలో మరిన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. నాలుగు బ్రాండ్లను రెండు బ్రాండ్లుగా ఏకీకృతం చేయడంతో ప్రస్తుతం Air India, Air India Express అనే నిర్మాణం కొనసాగుతోంది. ఇప్పుడు Air India Expressను కూడా Air India గ్రూప్లో విలీనం చేసే ఆలోచన ముందుకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తన ప్రారంభ సమావేశాల్లోనే ఎయిర్ ఇండియా కార్గో సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదని టెవోల్డే ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో Ethiopian Airlinesలో కార్గో వ్యాపారం సంస్థకు కీలక ఆదాయ వనరుగా మారిన అనుభవం ఆయనకు ఉంది. అలాగే విమానాల నిర్వహణకు సంబంధించిన సమస్యలను తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సిబ్బందిని ఆయన కోరినట్లు తెలుస్తోంది. టెవోల్డే ఈ నెలలో అధికారికంగా సంస్థలో చేరినప్పటికీ.. ఆయన విదేశీ పౌరుడు కావడంతో CEOగా బాధ్యతలు చేపట్టేందుకు భారత నియంత్రణ సంస్థల నుంచి తుది అనుమతి ఇంకా అవసరమని నివేదికలు పేర్కొన్నాయి. Air Indiaను మరింత సమర్థవంతంగా మార్చేందుకు టెవోల్డే చేపట్టే వ్యయ నియంత్రణ చర్యలు టాటా గ్రూప్తో పాటు సంస్థలో భాగస్వామిగా ఉన్న Singapore Airlinesకు కూడా కీలకంగా మారనున్నాయి. ఇదిలా ఉంటే కొత్త సీఈవో.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడతో సమావేశం అయ్యారు.

