NTV Telugu Site icon

సిరి – షణ్ముఖ్ ను టార్గెట్ చేసిన సరయు!

బిగ్ బాస్ సీజన్ 5 హౌస్ నుండి ఫస్ట్ ఎలిమినేట్ అయిన వ్యక్తి సరయు. బిగ్ బాస్ షో కు సంబంధించి గతంలో కంటే సీక్రెసీ మెయిన్ టైన్ చేస్తామని నిర్వాహకులు చెప్పినా… ఎలిమినేట్ అయిన వ్యక్తి ఇలా బయటకు రాగానే అలా వారిపేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ రకంగా నిన్న రాత్రి నుండి ఈ సీజన్ లో ఫస్ట్ ఎలిమినేట్ అవుతోంది సరయు అనే ప్రచారం జరిగిపోయింది. దాన్ని బలపరుస్తూ సరయు బిగ్ బాస్ హౌస్ నుండి భారమైన హృదయంతో బయటకు వచ్చేసింది. అయితే వేదిక మీదకు రాగానే నాగార్జునను హగ్ చేసుకున్న సరయు… ‘బిగ్ బాస్ షో లో పాల్గొనడం వల్ల తాను అఛీవ్ చేసింది ఇదే’ అన్న భావనను వ్యక్తం చేసింది. నాగార్జున బిగ్ బాస్ హౌస్ లోని ఐదుగురు బెస్ట్ పర్శన్స్ – ఐదుగురు వరెస్ట్ పర్శన్స్ ను చెప్పమనగానే సరయు ఎలాంటి సంకోచం లేకుండా చెప్పేసింది. ఆమె బెస్ట్ అన్నవాళ్ళలో శ్వేతవర్మ, మానస్, ప్రియాంక, విశ్వ, హమీద ఉన్నారు. ఇక వరెస్ట్ జాబితాలో సిరి, సన్ని, లహరి, షణ్ముఖ్, కాజల్ ఉన్నారు. చిత్రం ఏమంటే… సిరి, షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు నుండే ఓ పద్ధతి ప్రకారం కలిసి స్ట్రేటజీ ప్లే చేస్తున్నారని సరయు ఆరోపించింది. సిరిని డైరెక్ట్ గా అటాక్ చేసిన సరయు… సిరిని ముందు పైకి లేపి ఆ తర్వత తాను పైకి రావాలని షణ్ముఖ్ చూస్తున్నాడని చెప్పింది. ఇక సన్నితో గతంలో తానో సినిమాలో నటించానని, అక్కడ ఎదురైన చేదు అనుభవం కారణంగా మనలో ఏదో పెట్టుకుని తనను సన్నీ నామినేట్ చేశాడని సరయు చెప్పింది. మొత్తం మీద బిగ్ బాస్ హౌస్ నుండి వెళుతూ సరయు తనదైన శైలిలోనూ మాటల తూటాలను గట్టిగానే పేల్చింది. అయితే సరయును మిస్ అయిన వాళ్ళలో ప్రధానంగా విశ్వ, హమీదాను చెప్పుకోవాలి. సరయు బిగ్ బాస్ హౌస్ గడప దాటే వరకూ విశ్వ హౌస్ లోపలే తనలో తాను కుమిలిపోతూ కనిపించాడు. ఇక హమీదా మరోసారి కన్నీటి పర్యంతమయ్యింది.

దీనికి ముందు నాగార్జున బిగ్ బాస్ హౌస్ లోని సభ్యుల నుండి వ్యూవర్స్ కు చక్కని వినోదాన్ని అందించే ప్రయత్నం చేశారు. జెస్సీని వన్ ఆఫ్ ది జడ్జ్ ను చేస్తూ మిగిలిన 18 మందిని తొమ్మిది జంటలుగా మార్చి ర్యాంప్ వాక్ చేయించారు. ఈ జంటలకు జెస్సీతో పాటు నాగార్జున కూడా మార్కులు వేశారు. ఇందులో రవి – హమీదా జోడీ… జెస్సీ- యాని మాస్టర్ మధ్య జరిగిన గొడవను ర్యాంప్ వాక్ లో చూపించగా, లోబో – ఉమాదేవి ర్యాంప్ వాక్ లో ఫుల్ కామెడీ చేశారు. అలానే షణ్ముఖ్ – ప్రియ జంట తమ డాన్స్ తో అలరించారు. విశేషం ఏమంటే ర్యాంప్ వాక్ లో చివరిగా వచ్చిన శ్వేతవర్మ – ప్రియాంకకు ఇటు జెస్సీ, అటు నాగార్జున ఇద్దరూ పదేసి మార్కులు వేసి, అత్యధిక స్కోర్ ను కట్టబెట్టారు. అయితే ఆ తర్వాత లోబోను పక్కన పెట్టి… ఇద్దరు ఇద్దరు జంటగా ‘నేను మీకు తెలుసా’ ఆట ఆడించారు. కానీ అదంత పెద్దగా రక్తి కట్టలేదు. ఆ తర్వాత హౌస్ లోని సభ్యులందరికీ ముద్దు పేర్లు ఇవ్వమని లోబోను నాగ్ కోరారు. అందరికీ వారితో తనకున్న అనుబంధాన్ని, తాను గమనించిన విషయాలను బట్టి ముద్దు పేర్లు పెట్టిన లోబో… లహరికి మాత్రం ముద్దు పేరు పెట్టడానికి ససేమిరా అన్నాడు. అలానే ఉమాదేవికి వచ్చే నెలలో పెడతానని తప్పించుకున్నాడు. అందరికీ అందమైన ముద్దు పేర్లు పెట్టిన లోబో కాజల్ కు ఎలుక అని, సరయుకు తొండ అని పెట్టడం చిత్రం!

దానికి ముందు నాగ్ కోరిక మేరకు విశ్వ… లోబోను పైకి ఎత్తి… తన స్టామినా ఏమిటో వ్యూవర్స్ కు చూపించాడు. మొత్తం మీద ఆదివారం కాజల్, జెస్సీ, మానస్ సేవ్ అయిపోయారు. మరి మొదటి వారమే నామినేట్ అయ్యి.. సేఫ్ జోన్ లోకి వెళ్ళిన వీరు రాబోయే రోజుల్లో తమ ప్రత్యేకతను ఎలా చాటుతారో చూడాలి.