NTV Telugu Site icon

ఆర్జే కాజల్ టార్గెట్ కాబోతోందా!?

Bigg Boss 5 : who corner RJ Kajal

బిగ్ బాస్ సీజన్ 5 షోలో అవకాశం పొందిన ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఇవ్వాలనే తాపత్రయంతో ఉన్నారు. గడిచిన నాలుగు వారాల్లో హౌస్ లో ఏర్పడిన అనుబంధాలను కొనసాగిస్తూనే, టాస్క్ వచ్చినప్పుడు మాత్రం ఎవరికి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. గత రెండు రోజులుగా, మరీ ముఖ్యంగా బిగ్ బాస్ రాజ్యంలో ఒక్కడే రాజు టాస్క్ సందర్భంగా రెండు జట్లుగా విడిపోయిన సభ్యులు సైతం కొంత ఆట అయ్యాక, ఇటూ అటూ మారడంతో రాజకుమారుల ఈక్వెషన్స్ దెబ్బతిన్నాయి. ధనం అధికంగా ఉన్నా ప్రజల మద్దత్తు తక్కువ కావడంతో ఆ టాస్క్ లో సన్నీ ఓడిపోయాడు. అంతేకాదు… అతన్ని బలపరిచిన మానస్ సైతం మానసికంగా బలహీన పడ్డాడు. 32వ రోజు వీరిద్దరూ స్మోకింగ్ జోన్ లోకి వెళ్ళి, కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. అప్పటి వరకూ ప్రియాంక అంటే ప్రేమ చూపించిన మానస్ ఆమెకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చాడు. ఆమె రాత్రి పొద్దుపోయాక తినడానికి ఏదో కలిపి తీసుకొచ్చినా, తీసుకోవడానికి నిరాకరించాడు. తామిద్దరి గురించి ఎవరో ఒకరు కంప్లయింట్ చేస్తారని, అది తనకు ఇష్టం లేదని చెప్పాడు. ప్రియా అనునయించే ప్రయత్నం చేసినా మానస్ మాత్రం ప్రియాంక తెచ్చిన వంటకాన్ని తీసుకోవడానికి ఇష్ట పడలేదు. దాంతో ప్రియాంక ముఖం మాడిపోయింది. ఒక్కతే దూరంగా కూర్చుని కాసేపు బాధపడింది. ఎవరి మీద ప్రేమ చూపించకుండా ఎలా ఉంటాం!? అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.

కెప్టెన్సీ టాస్క్ లో విజేతగా ప్రియా!
వాటర్ ట్యాంక్ లీక్ ను ఆపే టాస్క్ లో యాని, శ్వేత, రవి, ప్రియా పాల్గొన్నారు. వారికి మిగిలిన సభ్యులు బాగానే సాయం చేశారు. అయితే… వీరంతా ఒకే టీమ్ కు చెందిన వారు కావడంతో వారిలో ఎవరి కోసం ఎవరు త్యాగం చేయాలనే ప్రశ్న ఉదయించింది. ట్యాంక్ లోని నీళ్ళు తగ్గిపోతున్న క్రమంలో రవి టాస్క్ నుండి తప్పుకుని ప్రియా వాటర్ ట్యాంక్ లో నీళ్ళు పోశాడు. ఇదే సమయంలో స్నేహమంటే ఇదేనా అంటూ యానీ మాస్టర్ కళ్ళ నీళ్ళు పెట్టుకోవడంతో జెస్సీ సైతం ఆమె ట్యాంక్ ను నింపే ప్రయత్నం చేశాడు. అయితే బజర్ మోగే సమయానికి ప్రియా వాటర్ ట్యాంక్ లో నీళ్ళు అధికంగా ఉండటంతో ఆమెను బిగ్ బాస్ కెప్టెన్ గా ఎంపిక చేశాడు. ప్రియా కెప్టెన్ కావడం తనకు ఇష్టం లేదని సన్నిహితుల దగ్గర సన్నీ ఆ తర్వాత వాపోయాడు. ఇక రేషన్ మేనేజర్ గా ఎవరిని నియమించాలనే విషయంలోనూ తర్జనభర్జనలు జరిగాయి. ఎవరు ఏ సలహాలు ఇచ్చినా వాటిని పట్టించుకోకుండా, ప్రియా విశ్వను రేషన్ మేనేజర్ గా నియమించింది.

జైలుకెళ్ళిన కాజల్
బిగ్ బాస్ ఐదోవారం హౌస్ లో వరెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు? అనే ఆరా తీశారు. అందులో ఎక్కువ మంది ఎవరి పేరు చెబితే, వారిని జైలుకు పంపుతానని అన్నారు. గత వారం రోజులుగా తోటి సభ్యుల ప్రవర్తన, తమతో మెలిగిన తీరును బట్టి ఎక్కువ మంది కాజల్ ను టార్గెట్ చేశారు. మొట్టమొదట శ్వేత కాజల్ పేరు చెప్పింది. గార్డెన్ ఏరియాలోని నెక్ లాక్ లో ఎవరి పేరైతే చెబుతారో వారిని తలను అందులో పెట్టి, కారణం చెప్పి, గ్లాసుడు నీళ్ళు వాళ్ళ ముఖం మీద కొట్టాలి. గతంలో ఇలానే రంగుల్ని ముఖం మీద చల్లించిన బిగ్ బాస్ ఇప్పుడు మంచినీళ్ళను వాడాడు. అయితే నెక్ లాక్, హ్యాండ్స్ లాక్ అనేది ఇప్పుడు అదనం. ఇందులో కాజల్ పేరును శ్వేతతో పాటు హమీద, శ్రీరామ్, యాని, లోబో, రవి, విశ్వ చెప్పారు. వీరంతా కాజల్ ముఖం మీద నీళ్ళు పోయగా, యానీ మాస్టర్ మాత్రం కాజల్ మీద కోపాన్ని తన మీద తానే మూడు సార్లు ముఖంపై నీళ్ళు పోసుకుని వ్యక్తం చేసింది. ఇక మిగిలిన వారిలో వరెస్ట్ పెర్ఫార్మర్స్ గా జెస్సీ, మానస్, సన్నీ, కాజల్‌… శ్రీరామ్ పేరు చెప్పగా ; షణ్ముఖ్, సిరి, ప్రియాంక… విశ్వ పేరు చెప్పారు. చిత్రం ఏమంటే… వరెస్ట్ పెర్ఫార్మర్ గా కాజల్, శ్రీరామ్, విశ్వ పేరు తప్పితే మిగిలిన వారి పేరు ఎవరూ ప్రస్తావించలేదు. దాంతో ఎక్కువ మంది వరెస్ట్ పెర్ఫార్మర్ గా కాజల్ పేరు చెప్పడంతో ఆమె జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. చివరగా సెంచరీ మాట్రిస్ ప్రమోషన్ లో భాగంగా హౌస్ లోని మెంబర్స్ ను రెండు టీమ్స్ గా చేసి ఏ టీమ్ మాట్రిస్ మీద ప్లాంక్ పొజిషన్ లో ఎక్కువ సేపు ఉంటుందనే గేమ్ ను పెట్టారు. అందులో రవి టీమ్ గెలవడంతో అతని సభ్యులకు ఆ సంస్థ గిఫ్ట్ హ్యాంపర్స్ అందించింది.

ఓవర్ ఆల్ గా 33వ రోజు వ్యవహారం చూస్తే షణ్ముఖ్, ప్రియా, జెస్సీలతో కాజల్ చేతులు కలపడాన్ని మిగిలిన ఇంటి సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. దాంతో గతవారం నామినేషన్స్ టైమ్ లో షణ్ముఖ్ ను టార్గెట్ చేసినట్టుగానే ఈసారి వారి దృష్టి కాజల్ మీదకు మళ్ళింది. అయితే వ్యూవర్స్ నుండి వీరిద్దరికి మంచి సపోర్ట్ ఉందని తెలుస్తోంది.