Mahabharata Lessons: మహాభారతం…అది కేవలం పాండవులు – కౌరవుల మధ్య జరిగిన యుద్ధం కాదు. యుద్ధం ఎలా చేయాలో ప్రపంచానికి నేర్పించిన గ్రంథం! అవును! 18 రోజుల పాటు సాగిన కురుక్షేత్ర సంగ్రామంలో లక్షల మంది యోధులు పోరాడారు. అంతటి మహాసంగ్రామంలో కూడా కొన్ని నియమాలు ఉండేవి. సూర్యుడు అస్తమిస్తే యుద్ధం ఆగేది. నిరాయుధుడిపై దాడి చేయడం అధర్మం. సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం నిషిద్ధం. పిల్లలు, మహిళలు యుద్ధానికి దూరం. కానీ నేడు ప్రపంచం అభివృద్ధి చెందింది. ఆయుధాలు ఆధునికమయ్యాయి. కానీ యుద్ధాల నీతి? అది మాత్రం వెనక్కి వెళ్లిపోయింది. రాత్రి చీకట్లోనే క్షిపణులు ఎగురుతున్నాయి. నిద్రలో ఉన్న నగరాలు పేలుళ్లతో మేల్కొంటున్నాయి. సైనికులకంటే సామాన్యులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. కురుక్షేత్రం మనకు నేర్పిన పాఠాలను ఆధునిక ప్రపంచం మరచిపోతోందా అనే ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఇలాంటి మహాభారత యుద్ధంలో తలచుకుంటే యుద్ధ ఫలితాన్నే మార్చగల నలుగురు మహా శక్తులు మాత్రం ఆయుధాలు పట్టలేదు. వాళ్లు రంగంలోకి దిగి ఉంటే మహాభారతం కథే మరోలా ఉండేదేమో! ఇంతకీ ఎవరా నలుగురు? మొదటివాడు, బలరాముడు..! అంటే శ్రీకృష్ణుడి అన్నయ్య. అపారమైన బలానికి ప్రతీక. హస్తినాపురాన్నే తన నాగలితో గంగలోకి లాగగల శక్తి ఉన్న యోధుడు. ఒకవైపు ప్రియ శిష్యుడు దుర్యోధనుడు. మరోవైపు సొంత తమ్ముడు శ్రీకృష్ణుడు. ఎవరి పక్షం తీసుకున్నా ధర్మం గాయపడుతుందని భావించిన బలరాముడు. యుద్ధానికి దూరంగా నిలిచాడు. నేటి ప్రపంచంలో కూడా యుద్ధాన్ని ఆపగల శక్తి ఉన్న దేశాలు ఉన్నాయి. కానీ చాలా సందర్భాల్లో అవి మధ్యవర్తులుగా కాకుండా పక్షాలుగా మారిపోతున్నాయి. బలరాముడు శక్తి కంటే తటస్థతను ఎంచుకున్నాడు.
ఇక రెండోవాడు రుక్మి. శ్రీకృష్ణుడి బావ. పరాక్రమంలో గొప్పవాడు. కానీ అవమానం కొన్నిసార్లు ఖడ్గం కంటే లోతైన గాయాన్ని చేస్తుంది. పాత పగలు, వ్యక్తిగత కక్షలు ఎంతటి మహా యోధుడినైనా యుద్ధం నుంచి దూరం చేయగలవని రుక్మి కథ చెబుతుంది. మూడోవాడు బార్బరీకుడు. ఇతను భీముడి మనుమడు, కేవలం మూడు బాణాలతో యుద్ధరంగాన్ని ఖాళీ చేయగల మహావీరుడు. కానీ ఆయన చేసిన ఒక ప్రతిజ్ఞ ఓడిపోయే పక్షానికే తోడుగా నిలబడతానన్న మాట చివరికి యుద్ధ సమతుల్యతనే దెబ్బతీసే ప్రమాదంగా మారింది. అందుకే శ్రీకృష్ణుడు అతని శక్తిని కాదు. అతని త్యాగాన్ని ఎంచుకున్నాడు. నేడు కూడా ఇదే ప్రశ్న. శక్తి ఎవరి చేతిలో ఉంది అనేది కాదు. ఆ శక్తి ఎవరి కోసం ఉపయోగపడుతోంది అనేదే అసలు విషయం. ఇక నాలుగోవాడు విదురుడు. ఇతను ధర్మానికి మరో పేరు. అధర్మం గెలుస్తున్న సభలో నిలబడలేక, అధర్మం కోసం ఆయుధం పట్టలేక, ధర్మాన్ని వదిలి వెళ్లలేక, ఆయన తటస్థంగా నిలిచిపోయాడు. ఈ విధంగా చూస్తే మహాభారతం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. యుద్ధంలో గెలవడం గొప్ప కాదు… ధర్మాన్ని కాపాడటం గొప్ప. అప్పుడు యుద్ధాలకు నియమాలు ఉండేవి… ఇప్పుడు నియమాలకే యుద్ధం జరుగుతోంది. అప్పుడు రాజులు యుద్ధం చేసేవారు… ఇప్పుడు సామాన్యులే మూల్యం చెల్లిస్తున్నారు. కురుక్షేత్రం ముగిసిపోయి వేల ఏళ్లు కావొచ్చు… కానీ అది అడిగిన ప్రశ్న మాత్రం ఇంకా బ్రతికే ఉంది.

