Good Friday: క్రైస్తవులకు ఎంతో శుభకరమైన రోజు ‘‘గుడ్ ఫ్రైడే’’ ఈ ఏడాది ఏప్రిల్ 3న వస్తోంది. క్రైస్తవులు దీనిని ఒక ప్రత్యేకమైన, శోకదినంగా పాటిస్తారు. ఇదే రోజున ఏసు క్రీస్తుకు శిలువ వేసినట్లు నమ్ముతారు. ఈ రోజున క్రైస్తవులు చర్చ్లకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. చాలా మంది ఉపవాసం పాటిస్తారు. కొందరు మౌనంగా ఉంటూ తమ భక్తిని ప్రదర్శిస్తారు. అయితే, ఏసు క్రీస్తును హింసించి, శిలువ వేసిన ఈ రోజును ‘‘గుడ్ ఫ్రైడే’’గా ఎందుకు జరుపుకుంటారు. ఒక విషాద దినాన్ని ఎందుకు ‘‘గుడ్’’గా పేర్కొంటారనే సందేహం వస్తుంది.
అనేక కారణాలు:
గుడ్ ఫ్రైడేకు అనేక కారణాలు ఉన్నాయి. బైబిల్ ప్రకారం.. మనిషి చనిపోయిన రోజు పుట్టిన రోజు కన్నా పవిత్రమైందిగా భావించబడతుంది. ఈ రోజు ఏసు క్రీస్తు త్యాగం చేసిన పవిత్రమైనన రోజుగా భావిస్తారు, అందుకే దీనిని ‘‘గుడ్’’గా వ్యవహరిస్తారు. గుడ్ అనే పదానికి పూర్వకాలం ‘‘పవిత్రమైన’’ అనే అర్థం కూడా ఉండేది. అందుకే దీనిని ‘‘హోలీ ఫ్రైడే’’ అని కూడా పిలిచేవారు. కొన్ని ప్రాంతాల్లో దీనిని ‘‘బ్లాక్ ఫ్రైడే’’ లేదా ‘‘గ్రేట్ ఫ్రైడే’’గా కూడా పిలుస్తారు.
ఏసుకు ఎందుకు శిలువ వేశారు:
సుమారు 2000 ఏళ్ల క్రితం, ఏసు క్రీస్తు ప్రజలకు అహింస, ప్రేమ, కరుణ, ఐక్యత, మానవత్వ వంటి విలువల్ని బోధించారు. ఆయన ఉపదేశాలకు ప్రజలు ఆకర్షితులై ఆయనను దేవుడిగా, దేవుడి కుమారుడిగా ఆరాధించడం మొదలుపెట్టారు. క్రమంగా ఏసుకు పెరుగుతున్న ఆదరణ చూసిన మత గురువులు ఆయనపై ద్వేషాన్ని పెంచుకున్నారు. ఈ మతనాయకులంతా కుట్ర పన్ని, అప్పటి రోమన్ పాలకుడికి ఏసు గురించి లేనిపోని అబద్ధాలు చెప్పారు. క్రీస్తు తాను దేవుని కుమారుడనని చెప్పుకుంటున్నాడని, ఆయన మాటలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఫిర్యాదు చేశారు. దీంతో ఏసు క్రీస్తుపై దేశ ద్రోహం అభియోగాలు మోపి, వేలాది మంది ప్రజల సమక్షంలో ఆయన శరీరాన్ని శిలువ వేశారు. ఆయనకు ముళ్ల కిరీటాన్ని పెట్టి, కొరడాలతో కొడుతూ శిలువ వద్దకు తీసుకెళ్లి, ఆయన కాళ్లు చేతులకు మేకులు కొట్టి శిలువకు వేలాడదీశారు.
