Top SUVs Coming to India in 2026 : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా SUVల సందడే కనిపిస్తోంది. ముఖ్యంగా మిడ్-సైజ్ SUV సెగ్మెంట్లో పోటీ ఆకాశాన్ని తాకుతోంది. ప్రస్తుతం ఈ విభాగంలో హ్యుందాయ్ క్రేటా, కియా సెల్టోస్ వంటి మోడళ్లు తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. అయితే, ఈ ఆధిపత్యానికి గండి కొట్టేందుకు రెనాల్ట్, నిస్సాన్, స్కోడా , ఫోక్స్వ్యాగన్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు సరికొత్త మోడళ్లతో భారత్లోకి దండయాత్రకు సిద్ధమయ్యాయి. 2026 నాటికి ఈ సెగ్మెంట్లో పెను మార్పులు రాబోతున్నాయి.
భారత్లో మిడ్-సైజ్ SUV సెగ్మెంట్కు పునాది వేసిన ‘రెనాల్ట్ డస్టర్’ మళ్ళీ కొత్త అవతారంలో రాబోతోంది. పాత మోడల్ నిలిపివేసిన తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న రెనాల్ట్, ఇప్పుడు ‘న్యూ జనరేషన్ డస్టర్’ను మరింత శక్తివంతంగా రూపొందించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ-బుకింగ్స్ ప్రారంభం కాగా, మార్చిలో కంపెనీ దీని ధరను అధికారికంగా ప్రకటించనుంది. ఏప్రిల్ నుండి కస్టమర్లకు డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఇది అడ్వెంచర్ ప్రియులను , ఫ్యామిలీస్ ను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక ఫీచర్లతో రాబోతోంది.
Hyderabad Rains : హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం.. జిల్లాల్లో ఈదురుగాలుల బీభత్సం.!
నిస్సాన్ ఇండియా తన ఉనికిని మరింత చాటుకునేందుకు ‘టెక్టన్’ (Tekton) అనే సరికొత్త మిడ్-సైజ్ SUVని రంగంలోకి దించుతోంది. 2026 మధ్య నాటికి ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. నిస్సాన్ కేవలం టెక్టన్ తోనే ఆగకుండా, ఒక కొత్త 7-సీటర్ SUVని కూడా ప్లాన్ చేస్తోంది. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా వైడ్ డిజైన్ , స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో ఈ కార్లు ఉండబోతున్నాయి.
యూరోపియన్ కార్ల దిగ్గజం స్కోడా, తన పాపులర్ మోడల్ ‘కుషాక్’ ఫేస్లిఫ్ట్ వెర్షన్ను అప్డేట్ చేసింది. మెరుగైన సేఫ్టీ ఫీచర్లు, కొత్త ఇంటీరియర్స్తో రాబోతున్న ఈ కారు డెలివరీలు మార్చి చివరి నాటికి మొదలవుతాయి. ఇదే క్రమంలో ఫోక్స్వ్యాగన్ కూడా తన ‘టైగన్’ మోడల్ను అప్డేట్ చేస్తోంది. 2026 రెండో త్రైమాసికంలో కొత్త టైగన్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ రెండు కంపెనీలు తమ ‘ఇండియా 2.0’ ప్రాజెక్టులో భాగంగా భారీ పెట్టుబడులతో ఈ మోడళ్లను భారత్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశాయి.
2024తో పోలిస్తే 2025లో SUVల అమ్మకాలు 7.85 శాతం వృద్ధి చెందాయి. రాబోయే రెండేళ్లలో ఈ సెగ్మెంట్లో డజనుకు పైగా కొత్త మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి. టాటా కర్వ్, మహీంద్రా థార్ రాక్స్, మారుతి గ్రాండ్ విటారా వంటి కార్లు ఇప్పటికే గట్టి పోటీ ఇస్తుండగా, ఇప్పుడు రాబోతున్న ఈ కొత్త మోడళ్లు మార్కెట్ సమీకరణాలను మార్చే అవకాశం ఉంది. దీనివల్ల కస్టమర్లకు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు, మెరుగైన సేఫ్టీ ఉన్న కార్లు ఎంచుకునే అవకాశం లభిస్తుంది.
