NTV Telugu Site icon

YV Subbareddy : ఆర్జిత సేవల ధరలు పెంపుపై క్లారిటీ…

సామాన్య భక్తులకు సర్వదర్సనం ప్రారంభించి పదిరోజులవుతోందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రెండు సంవత్సరాల తరువాత సర్వదర్శనాన్ని ప్రారంభించామని, సర్వదర్శనం ప్రారంభమైన తరువాత భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని, భక్తుల రద్దీ పెరిగినా అన్నప్రసాదం వద్ద ఎలాంటి ఇబ్బందులు రానివ్వడం లేదని ఆయన వెల్లడించారు. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదాన్ని అందిస్తామని, ఉత్తర భారతదేశం నుంచి వచ్చే భక్తుల కోసం చపాతీలు, రొట్టెలను త్వరలోనే అందిస్తామని పేర్కొన్నారు. భోజనంతో పాటు మూడుపూటలా రొట్టెలు, చపాతీలను భక్తులకు అందిస్తామని, తిరుమలలోని మరో రెండు ప్రాంతాల్లో అన్నప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.

అయితే ఇటీవల పాలకమండలి ఆర్జిత సేవల టికెట్‌ ధరల పెంపుకు సంబంధించిన వీడియో వైరల్‌ అయ్యింది. అయితే దీనిపై ఆయన స్పందిస్తూ.. ఆర్జిత సేవలను పునఃప్రారంభించేందుకు సమయం పడుతుందని, త్వరలోనే ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా ఏప్రిల్ నుంచి అన్ని సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తున్నామని, ఏ సేవల ధరలను పెంచే ఆలోచన టీటీడీకి లేదని ఆయన స్పష్ట చేశారు. ఆర్జిత సేవల ధరలను పెంచే ఆలోచన ఇప్పట్లో లేదని, ధరల పెంపుపై కేవలం చర్చ మాత్రమే పాలకమండలిలో జరిగిందన్నారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడమే టీటీడీ పాలకమండలి ముఖ్య ఉద్దేశమన్నారు. వీఐపీ దర్శనాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన వెల్లడించారు.