NTV Telugu Site icon

YSRCP MP Talari Rangaiah: ప్రతిపక్షాలు ఏపీని శ్రీలంకతో పోల్చడం మానుకోవాలి

Talari Rangaiah

Talari Rangaiah

ysrcp mp talari rangaiah comments about debts in ap government: ఇటీవల వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ, జనసేన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. అప్పుల కారణంగా ఏపీ మరో శ్రీలంక కాబోతుందని ప్రచారం చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను వైసీపీ ఎంపీలు తాజాగా ఖండించారు. ఈ మేరకు ఢిల్లీలో వైసీపీ ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.. ఏపీలో అవినీతి లేని పాలనను జగన్ ప్రజలకు అందిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజలకు వందకు వంద రూపాయలు నేరుగా చేరుతున్నాయని… మధ్యవర్తులకు, దళారులకు, అవినీతికి తావు లేదన్నారు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసి దుబారా చేసిందని.. తాము అప్పు తెచ్చిన ప్రతి పైసాను సద్వినియోగం చేస్తున్నామని ఎంపీ తలారి రంగయ్య వివరించారు. ప్రతి ఉరిలో అభివృద్ధికి చిహ్నాలుగా గ్రామ సచివాలయాలు కన్పిస్తున్నాయని.. ప్రతిపక్షాలు అనవసర దుష్ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు.

Read Also: New Judges to AP High Court: ఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం

శ్రీలంకతో ఒక రాష్ట్రాన్ని పోల్చి చూడడం తగదని వైసీపీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. దేశం 133 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాలకు నీతులు చెప్పడం తగదన్నారు. జీడీపీలో కేంద్రం 59 శాతం అప్పు చేస్తే.. ఏపీ 32.4 శాతం అప్పు మాత్రమే చేసిందన్నారు. శ్రీలంక దేశం జీడీపీలో 101 శాతం అప్పు చేసిందని గుర్తుచేశారు. ఏపీలో పేదలకు సంక్షేమ పథకాల రూపంలో ఆర్ధిక తోడ్పాటు లభిస్తుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ తరహాలో నేరుగా లబ్ధిదారులకు ఆర్ధిక సహాయం లభించడం చాలా సంతోషంగా ఉందని ఎంపీ తలారి రంగయ్య అభిప్రాయపడ్డారు.