NTV Telugu Site icon

ఎన్టీఆర్ వర్థంతి రోజే చంద్రబాబుకు కరోనా… వైసీపీ ఎంపీ సెటైర్లు

ఎన్టీఆర్ 26వ వర్థంతి నాడు టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వర్థంతి రోజే చంద్రబాబుకు కరోనా సోకడం యాధృచ్ఛికమని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. చంద్రబాబుకు కరోనా సోకడం బాధాకరమని.. ఆయనకు వచ్చిన కరోనా తగ్గిపోతుందేమో కానీ… ఆనాడు ఎన్టీఆర్‌కు బాబు పొడిచిన వెన్నుపోటు తెలుగుజాతి ఉన్నంత వరకు గుర్తుంటుందని విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపైనా విజయసాయిరెడ్డి స్పందించారు. ఏపీ తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా గవర్నమెంటు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించిందని…. విధివిధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడం శుభపరిణామమన్నారు. తమ పిల్లలను మాత్రం ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తూ పేద పిల్లలకు ఆ అవకాశం వద్దని ఏడుస్తున్న చంద్రబాబు గ్యాంగు దీనిపై ఎలా స్పందిస్తుందో అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.