KRJ Bharath: ఏపీ శాసనమండలి ఛైర్మన్‌గా కుప్పం వైసీపీ నేత.. ఫోటో వైరల్..!!

Krj Bharat

Krj Bharat

KRJ Bharath: ఏపీలో కుప్పం రాజకీయాలు కాక రేపుతున్నాయి. వైసీపీ నేత, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చంద్రమౌళి కుమారుడు కేఆర్‌జే భరత్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా కుప్పం నియోజకవర్గ ఇంఛార్జిగా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన తాజాగా మండలి ఛైర్మన్ అవతారం ఎత్తారు. మొన్నటికి మొన్న మ‌హారాష్ట్ర అసెంబ్లీ స్పీక‌ర్‌గా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ న‌ర్వేక‌ర్ ఎన్నికై.. దేశంలోనే అతి చిన్న వ‌య‌సులో స్పీకర్‌గా ప‌ద‌వీ బాధ్యతలు చేప‌ట్టిన నేత‌గా గుర్తింపు సాధించారు. తాజాగా ఏపీ శాస‌న‌మండ‌లి స‌భ్యుడిగా కొన‌సాగుతున్న వైసీపీ యువ నేత కేఆర్‌జే భ‌ర‌త్‌ శాస‌న మండ‌లి ఛైర్మన్‌ కుర్చీలో కూర్చోవడం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Read Also:Typewriters Museum: మధ్యప్రదేశ్ వ్యక్తి రికార్డు.. 450 టైప్ రైటర్లతో మ్యూజియం ఏర్పాటు

శుక్రవారం జరిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా శాస‌న మండ‌లి ఛైర్మన్ మోషేన్ రాజు కాసేపు విశ్రాంతి తీసుకోగా… ఆయ‌న స్థానంలో భ‌ర‌త్ మండ‌లి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. మోషేన్ రాజు గైర్హాజ‌రీలో డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న జ‌కియా ఖానామ్ కూడా అందుబాటులో లేక‌పోవ‌డంతో ప్యానెల్ ఛైర్మన్‌గా ఉన్న భ‌ర‌త్‌.. కాసేపు మండ‌లి ఛైర్మన్ కుర్చీలో కూర్చుకున్నారు. దీంతో ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా 2019 ఎన్నిక‌ల్లో కుప్పం వైసీపీ అభ్యర్థిగా నామినేష‌న్ వేసి ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల కాక‌ముందే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి మృతి చెందారు. తండ్రి మృతితో కుప్పం వైసీపీ ఇంఛార్జి బాధ్యతలను సీఎం జగన్ భరత్‌కు అప్పగించారు. ఈ క్రమంలో వైసీపీ అధిష్టానం ఆయ‌న‌కు శాస‌న మండ‌లి స‌భ్యత్వాన్ని కట్టబెట్టింది.