Site icon NTV Telugu

Ramateertham incident: రామతీర్థం ఘటనలో కీలక పరిణామం.. ధ్వంసమైన విగ్రహాలు నేడు నిమజ్జనం..

Ramateertham Incident,

Ramateertham Incident,

Ramateertham incident: విజయనగరం జిల్లాలో సంచలనం సృష్టించిన రామతీర్థం ఘటనకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరేళ్ల క్రితం ధ్వంసమైన శ్రీ కోదండ రామస్వామి విగ్రహాలను నేడు ఆగమశాస్త్ర ప్రకారం నిమజ్జనం చేయనున్నారు. రామ తీర్థం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో విగ్రహాలను ఊరేగింపుగా తరలిస్తారు. నెల్లిమర్ల మండలం రామ తీర్థంలోని నీలాచల పర్వతంపై వెలసిన శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో 2020 డిసెంబర్ 28న అర్ధరాత్రి దుండగుల దాడిలో పురాతన రాముడి విగ్రహం ధ్వంసం కావడం రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహానికి దారితీసింది. ఈ ఘటనపై కేసులు నమోదై ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది.

Read Also: Raaka: బన్నీ ‘రాకా’లో ఊహించని మలుపు.. అట్లీ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

అయితే, ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ధ్వంసమైన విగ్రహాలను ఆలయంలో ఉంచకూడదనే నిబంధనతో.. రాముడి విగ్రహంతో పాటు సీతాదేవి, లక్ష్మణుడి పాత విగ్రహాలను జలాధివాసం చేయాలని నిర్ణయించారు. అయితే, విచారణలో భాగంగా విగ్రహ శిరస్సు భాగం కోర్టులో ఉండటంతో ఆలస్యమైంది. తాజాగా, కోర్టు అనుమతి లభించడంతో నిమజ్జనానికి మార్గం సుగమమైంది. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించనున్నారు.

రామతీర్థం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో విగ్రహాలను ఊరేగింపుగా తరలిస్తారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయం, సింహాచలం, అనకాపల్లి నూకాంబిక, అన్నవరం, పిఠాపురం, ద్రాక్షారామం వంటి ప్రముఖ ఆలయాల మీదుగా ఊరేగింపుగా తీసుకెళ్లి.. మధ్యాహ్నం 3.45 గంటలకు కోటిపల్లి చేరుకుంటారు. ఇక, ఊరేగింపు ముగించుకొని సాయంత్రం 4.48 గంటలకు గోదావరి తీరంలో వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు.

Exit mobile version