PM Modi: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో ఇది అత్యంత కీలకమైన రోజని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలుగులో అందరికీ నమస్కారం చెబుతూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ, సింహాచలం అప్పన్న స్వామి, పైడితల్లి అమ్మవారికి నమస్కారాలు తెలియజేసి, పవిత్రమైన ఉత్తరాంధ్ర నేలపై అడుగుపెట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
ఈ సందర్భంగా రూ.18 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేసినట్లు ప్రధాని తెలిపారు. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ను మరింత వేగంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తాయని చెప్పారు. భోగాపురం సభలో ఒకేసారి 13 వేల మందికి పైగా గిరిజన మహిళలు, విద్యార్థులు ప్రదర్శించిన సంప్రదాయ ధిమ్సా నృత్యం తనను ఎంతో ఆకట్టుకుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెండు రికార్డులు నమోదయ్యాయని, ఒకటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాగా, మరొకటి వేలాది మంది పాల్గొన్న ధిమ్సా నృత్య ప్రదర్శన అని అన్నారు.
అల్లూరి సీతారామరాజు గిరిజన హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని గుర్తు చేసిన ప్రధాని మోడీ, ఆయన పేరును భోగాపురం విమానాశ్రయానికి పెట్టడం గర్వకారణమని తెలిపారు. గతంలో విమానాశ్రయాలకు ఒకే కుటుంబానికి చెందిన పేర్లు పెట్టే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు దేశ గర్వకారణమైన మహనీయుల పేర్లను విమానాశ్రయాలకు పెడుతున్నామని చెప్పారు. అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు, పంజాబ్లో సంత్ రవిదాస్ పేరు, భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు.
దేశ విమానయాన రంగంలో గత దశాబ్దంలో జరిగిన మార్పులను వివరిస్తూ, 2014కు ముందు దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం వాటి సంఖ్య 166కు చేరిందని మోదీ వెల్లడించారు. ఉడాన్ పథకం ద్వారా చిన్న పట్టణాలను కూడా విమాన సేవలతో అనుసంధానం చేసి, పేద, మధ్యతరగతి ప్రజలకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఇక, ఆంధ్రప్రదేశ్లో పోర్టులు, రైల్వేలు, జాతీయ రహదారులు, పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోందని ప్రధాని వివరించారు. విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు ఉన్న పోర్టుల అభివృద్ధితో పాటు మూలపేట, రామాయపట్నంలో కొత్త పోర్టులు నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు అమలవుతున్నాయని, సెమీకండక్టర్లు, డేటా సెంటర్లు, ఫార్మా రంగాల్లో కొత్త పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.
తెలుగు ప్రజలు ప్రతిభావంతులని, ప్రపంచవ్యాప్తంగా తమ సామర్థ్యాన్ని నిరూపిస్తున్నారని కొనియాడిన ప్రధాని మోడీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ తయారీ రంగానికి కేంద్రంగా ఎదుగుతోందని అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో రాష్ట్ర అభివృద్ధి మరింత వేగంగా జరుగుతోందని పేర్కొంటూ, భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి, పెట్టుబడులు, అభివృద్ధికి కొత్త లాంచ్ప్యాడ్గా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ..

