CM Chandrababu: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కొత్త అధ్యాయం మొదలైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భోగాపురంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం జాతికి అంకితం చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర శక్తి, సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. భూములు ఇచ్చి ప్రాజెక్టు విజయానికి సహకరించిన రైతులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి పాదాభివందనం చేశారు. ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని ఉత్తరాంధ్రకు చెందిన జీఎంఆర్ సంస్థ పూర్తి చేయడం గర్వకారణమన్నారు. ప్రాజెక్టుకు తొలి అడుగు వేసిన అశోక్ గజపతిరాజు, నిర్మాణ బాధ్యతలు సమర్థంగా నిర్వహించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇద్దరూ ఈ ప్రాంతానికి చెందిన వారేనని గుర్తు చేశారు. భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వమే నేడు ప్రారంభోత్సవాన్ని కూడా నిర్వహించడం సంతోషకరమని చెప్పారు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయని, ఈ ప్రాంతానికి గూగుల్, స్టీల్ పరిశ్రమలతో పాటు మరిన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రానున్నాయని చంద్రబాబు వెల్లడించారు. ప్రధానమంత్రి మోడీ సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు పెట్టుబడులు రానున్నాయని, రూ.2,784 కోట్ల వ్యయంతో ఎనిమిది ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. రెండేళ్ల క్రితం తీవ్ర ఆర్థిక సవాళ్లు ఎదుర్కొన్న రాష్ట్రానికి ప్రధాని మోడీ అండగా నిలిచారని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్, విశాఖ ఉక్కు పరిరక్షణ, అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2028 నాటికి అమరావతి తొలి దశ నిర్మాణ పనులను పూర్తి చేసి, ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు.
ప్రధాని మోడీ నాయకత్వాన్ని కొనియాడిన సీఎం, గత 12 ఏళ్లుగా దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. డిజిటల్ ఇండియా రూపకల్పన, ఆధునిక రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాల నిర్మాణం, సౌరశక్తి, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని వేగంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాయని చెప్పారు. “నేషన్ ఫస్ట్” భావనతో పనిచేస్తున్న నాయకుడిగా మోడీని అభివర్ణించిన చంద్రబాబు, 2047 నాటికి భారత్ ప్రపంచంలో అగ్రదేశంగా అవతరిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

