PM Modi AP Visit: భోగాపురం విమానాశ్రయం చుట్టూ ఆంక్షలు.. 5 కిలోమీటర్ల మేర నో ఫ్లైయింగ్ జోన్

  • భోగాపురంలో 48 గంటల నో ఫ్లైయింగ్ జోన్..
  • ప్రధాని మోదీ పర్యటనకు భారీ భద్రత..
  • భోగాపురం పరిసరాల్లో డ్రోన్లపై పూర్తిగా నిషేధం..
  • ఐదు కిలోమీటర్ల మేర నో ఫ్లైయింగ్ జోన్
Pm Modi Ap Visit

Pm Modi Ap Visit

PM Modi AP Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భోగాపురం పర్యటన నేపథ్యంలో విజయనగరం జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ మేరకు భోగాపురం విమానాశ్రయం పరిసర ప్రాంతాలను 48 గంటల పాటు నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు జూలై 30 రాత్రి 8 గంటల నుంచి ఆగస్టు 1 రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటాయి. విమానాశ్రయం, సభా వేదిక, హెలిప్యాడ్ చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేక ఆంక్షలు అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమయంలో డ్రోన్లు, యూఏవీలు (UAVలు), పారా గ్లైడర్లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు వంటి ఎలాంటి గగనతల పరికరాలను వినియోగించడానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు.

బీఎన్‌ఎస్‌ఎస్-2023 సెక్షన్ 163 ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన ఎలాంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా జరిగేలా ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు. భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, నిషేధాజ్ఞలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. కాగా, విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ హరిత విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేయనున్నారు.. దాదాపు 2 గంటలకుపైగా మోడీ పర్యటన కొనసాగనుంది.. ఆగస్టు 1వ తేదీన అంటే శనివారం రోజు ఉదయం 10.45 నుంచి మధ్యాహ్నం 1.05 వరకు భోగాపురం ఎయిర్‌ పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు.. ఉదయం 10.45కి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు మోడీ.. ఇక, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు.. ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత భోగాపురం ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ భవనానికి చేరుకోనున్నారు ప్రధాని.. భోగాపురం విమానాశ్రయాన్ని పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఓపెన్‌ టాప్‌ జీపులో బహిరంగ సభా వేదికకు చేరుకోనున్నారు.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం, శిలా ఫలకం ఆవిష్కరణతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ..