BJP: ఉండవల్లికి విష్ణువర్ధన్‌రెడ్డి కౌంటర్.. ఊసరవెల్లి రాజకీయాలు కట్టిపెట్టండి

Vishnu Vardhan Reddy

Vishnu Vardhan Reddy

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆదివారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కీలకంగా సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించారు. ఈ భేటీ వివరాలను ఆయన సోమవారం ప్రెస్‌మీట్ పెట్టి వివరించారు. ఈ సందర్భంగా బీజేపీపై ఉండవల్లి అరుణ్‌కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ విధానాలు దేశానికి ప్రమాదకరంగా మారాయన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఉండవల్లి తెలిపారు.

తాజాగా ఉండవల్లి అరుణ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.విష్ణువర్ధన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఉండవల్లి ఓవైపు రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెబుతూనే ఆయన రాజకీయాల గురించి మాట్లాడతారని విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా రాజకీయ నేతలను కూడా కలుస్తారని.. అదేమని ప్రశ్నిస్తే అబ్బెబ్బే అదేం లేదండి.. ఉత్తినే పిలిస్తే వెళ్ళానంటారని ఎద్దేవా చేశారు. ఉండవల్లికి అంత కుతూహలం ఉంటే దేశంలో కిందపడిపోయిన కాంగ్రెస్ పార్టీని తిరిగి పైకి లేపడానికి కృషి చేయాలని హితవు పలికారు. రాజకీయ బిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల నేతలతో కలిసి బీజేపీపై విమర్శలు చేయడం సరికాదని విష్ణువర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా ఉండవల్లి ఊసరవెల్లి రాజకీయాలు మానేసి ఆయన దృష్టిని బీజేపీ మీద పెట్టడం కాకుండా కాంగ్రెస్ పార్టీని పైకి లేపడం మీద పెడితే బాగుంటుందన్నారు.