NTV Telugu Site icon

Vishnu Kumar Raju: కన్నాను కలిసిన విష్ణుకుమార్‌ రాజు.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు

Vishnu Kumar Raju

Vishnu Kumar Raju

Vishnu Kumar Raju: బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, బీజేపీ ఏపీ మాజీ చీఫ్‌ కన్నా లక్ష్మీనారాయణ.. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్నారు.. అయితే, కన్నా బాటలో పలువురు బీజేపీ నేతలు కూడా టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఇప్పటికే కన్నా అనుచరులు బీజేపీకి గుడ్‌బై చెప్పి.. కన్నాతోనే మా ప్రయాణం అని స్పష్టం చేస్తుండగా.. ఇవాళ బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రెడ్డి.. కన్నా ఇంటికి వచ్చారు.. ఈ సందర్భంగా సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు విష్ణుకుమార్‌ రాజు.. భారతీయ జనతా పార్టీలో పరిస్థితులు బాగోలేవన్న ఆయన.. బీజేపీ కార్యకర్తలతో.. నాయకులతో మాట్లాడే తీరిక అధిష్టానానికి లేదని విమర్శలు గుప్పించారు.. పార్టీలో వర్గ విభేదాలపై కేంద్రం దృష్టికి అనేక సందర్భాల్లో తీసుకెళ్లాను.. అయినా ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Attack on TDP Office: గన్నవరంలో టెన్షన్‌ టెన్షన్‌.. టీడీపీ ఆఫీసుపై వంశీ వర్గీయుల దాడి..!

అయితే, కన్నా లక్ష్మీనారాయణకి అధిష్టానానికి మధ్య ఉన్న విభేదాలపై నేను మాట్లాడను.. దీనికి బీజేపీ అధిష్టానం సమాధానం చెప్పాలన్న ఆయన.. గతంలో నేను బీజేపీ ఎమ్మెల్యేగా.. ఫ్లోర్ లీడర్‌గా పనిచేశాను.. కానీ, నేను చెప్పిన మాటలు కూడా అధిష్టానం వినే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు విష్ణుకుమార్‌ రాజు.. ఆంధ్రప్రదేశ్‌లోని బీజేపీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్న ఆయన.. నేను వ్యక్తిగతంగా కన్నాను కలవడానికి మాత్రమే వచ్చాను.. పార్టీ మారినంత మాత్రాన వ్యక్తి గత పరిచయాన్ని తెంచుకొలేను అని స్పష్టం చేశారు.. మరోవైపు.. తాజాగా బీజేపీ బైబై చెప్పిన కన్నాతో విష్ణుకుమార్‌ రాజు భేటీ కావడంపై కొత్త చర్చ తెరపైకి వచ్చింది.. విష్ణుకుమార్‌ రాజు కూడా బీజేపీ రాజీనామా చేస్తారనే చర్చ నడుస్తుండగా.. పార్టీ మారతాను అన్న ప్రచారం మాత్రం కరెక్ట్‌ కాదు.. నేను కేవలం వ్యక్తిగతంగా మాట్లాడడానికే కన్నా ఇంటికి వచ్చాను అని క్లారిటీ ఇచ్చారు విష్ణుకుమార్‌ రాజు.