NTV Telugu Site icon

YS Sharmila: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఇష్యూపై షర్మిల డెడ్‌లైన్‌..! 48 గంటల్లో తేల్చకపోతే నిరాహార దీక్ష..

Ys Sharmila

Ys Sharmila

YS Sharmila: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారంలో ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ పెట్టారు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. విశాఖ పర్యటనలో ఉన్న ఆమె.. కూర్మనపాలెం స్టీల్ ప్లాంట్ దీక్ష శిభిరానికి వెళ్లి.. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు.. దీక్షా శిబిరం వద్ద రోడ్డుపై బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసన తెలిపారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైజాగ్‌ స్టీల్ ప్లాంట్ ను కాపాడకపోతే.. తొలగించిన 4,000 మందిని ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోపోతే 48 గంటల్లో నిరాహార దీక్షకు దిగుతాను అని ప్రకటించారు.. నాలుగో తేదీన మధ్యాహ్నం ఒంటి గంటలోపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగులను తిరిగి తీసుకుంటున్నామని ప్రకటించకపోతే.. వైఎస్‌ షర్మిల రెడ్డి.. స్టీల్ ప్లాంట్ వద్ద దీక్షకు దిగుతుందని వెల్లడించారు.. నేనే కాదు అవసరమైతే రాహుల్ గాంధీని కూడా తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తాం అన్నారు.. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌.. బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.. స్టీల్ ప్లాంట్‌ను కాపాడనప్పుడు పొత్తులెందుకు..? అని ప్రశ్నించారు.

Read Also: Rajinikanth : హాస్పిటల్ లో రజినీ.. తదుపరి సినిమాల పరిస్థితి ఏంటి..?

సీఎం చంద్రబాబు నాయుడు కనీసం ఇక్కడకు వచ్చి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు భరోసే ఇవ్వలేకపోతున్నారని దుయ్యబట్టారు షర్మిల.. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ స్టీల్ ప్లాంట్ కొచ్చి కార్మికులకు మద్దతు ఇవ్వాలని కోరారు.. తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి ఈ చర్యలన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.. స్టీల్ ప్లాంట్ కు ఎటువంటి లోటు ఉండదు అని చంద్రబాబు హామీ ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్లాలని సూచించారు కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల..