విశాఖపట్నంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో పెళ్లి దండలతోనే నవ వధువు మృతి చెందగా.. నవ వరుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పెళ్లి వేడుక ముగిసిన తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన నవ దంపతుల జీవితంలో విషాదం నెలకొనడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. పెళ్లి కార్యక్రమం అనంతరం నవ దంపతులు వాడచీపురుపల్లికి కారులో ప్రయాణిస్తుండగా విశాఖలోని శనివాడ జంక్షన్ దగ్గర మృత్యువు వెంటాడింది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారులో ఉన్న నవ వధువు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె మెడలో ఇంకా పెళ్లి దండలు ఉండగానే మృతి చెందడం స్థానికులను కలచివేసింది.
ఇక ఈ ప్రమాదంలో వరుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆనందంగా సాగాల్సిన పెళ్లి వేడుక క్షణాల్లోనే విషాదంగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
