Visakhapatnam: విశాఖపట్నంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. భర్త విడిచి పెట్టేశాడు అనే మనస్థాపంతో ఐదు నెలల పసికందును రైల్వే స్టేషన్ దగ్గర ఆటోలో వదిలేసిన తల్లి ఘటన స్థానికంగా సంచలనం రేపుతుంది. అయితే, ఉపాధి నిమిత్తం గత ఏడాది విజయవాడకు భార్యాభర్తలు శ్రావణి, అర్జున్ వెళ్లారు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో వారి దాంపత్య జీవితం గందరగోళానికి దారి తీసింది. విజయవాడలో పనులు లేకపోవడంతో జన్మభూమి ఎక్స్ప్రెస్ రైల్లో విశాఖపట్నం వైపు బయలుదేరారు.
Read Also: AP Cabinet: నేడే ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
ఇక, ఈ ప్రయాణంలో భార్యను వదిలించుకునే ఉద్దేశంతో దువ్వాడ రైల్వే స్టేషన్ వద్ద భర్త అర్జున్ రైలు దిగిపోయినట్లు తెలుస్తుంది. ఎంత వెతికినా భర్త ఆచూకీ దొరకకపోవడంతో తనను ఉద్దేశపూర్వకంగానే వదిలించుకునేందుకు ఇలా చేశాడని శ్రావణి భావించినట్లు సమాచారం. విశాఖపట్నం రైల్వే స్టేషన్కు చేరుకున్న అనంతరం తీవ్ర మనస్థాపానికి లోనైన శ్రావణి, పసికందుని ఆటోలోనే వదిలేసి సమీపంలోని కాంప్లెక్స్ వైపు వెళ్లిపోయింది. ఇక, ఆటోలో ఉన్న పసికందును గమనించిన ఆటో డ్రైవర్లు వెంటనే ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలుడి తల్లిని గుర్తించి విచారణ చేపట్టారు.