Minister Nara Lokesh: విశాఖపట్నం నగరం ఇకపై కొత్త దిశగా అడుగులు వేయబోతోందని, ఉక్కు నగరంగా పేరుగాంచిన విశాఖ ఇకపై డేటా సిటీగా, ఏఐ హబ్గా మారబోతోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ ముఖచిత్రం ఈరోజుతో మారిపోతోందని పేర్కొన్నారు. భారత్లోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని గూగుల్ విశాఖకు తీసుకువచ్చిందని లోకేష్ తెలిపారు. 2026 ఏప్రిల్ 28 నుంచి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ చరిత్ర సృష్టించబోతోందన్నారు. గ్లోబల్ ఐటీ మ్యాప్లో విశాఖ స్థానం సంపాదించుకుందని చెప్పారు.
Read Also: Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
2019 నుంచి 2024 మధ్య రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, దానిని తిరిగి పునరుద్ధరించేందుకు ప్రజలు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని లోకేష్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు నాయుడికి హైటెక్ సిటీ నిర్మించిన అనుభవం ఉందని, ఇప్పుడు విశాఖలో కూడా అదే తరహా అభివృద్ధి తీసుకొస్తున్నారని చెప్పారు. ఆర్సెలార్ మిట్టల్, గూగుల్ వంటి అంతర్జాతీయ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో దేశంలోకి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం వరకు ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయని వెల్లడించారు. రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు లోకేష్. సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, మెకానికల్ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని
“ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని” అనేది ప్రజా ప్రభుత్వ విధానమని, “అభివృద్ధి వికేంద్రీకరణ” తమ నినాదమని లోకేష్ స్పష్టం చేశారు. క్లస్టర్ ఆధారిత అభివృద్ధితో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వేర్వేరు రంగాల్లో పెట్టుబడులు తీసుకొస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. విశాఖలో ప్రారంభమైన గూగుల్ ఏఐ డేటా సెంటర్తో కొత్త అభివృద్ధి దశకు శ్రీకారం చుట్టినట్టేనని అన్నారు మంత్రి నారా లోకేష్…
