Minister Narayana: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాతావరణం వచ్చినట్టే కనిపిస్తోంది.. ఎన్నికల ప్రక్రియకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. మరోవైపు.. బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ.. స్థానిక సంస్థల్లో వాటిని అమలు చేసేలా కూడా నిర్ణయాలు తీసుకున్నారు.. అయితే, ఈ సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోర్టు తీర్పుపై ఆధారపడి ఉందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలపై కోర్టు తీర్పు రావాల్సి ఉందని, తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తోందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. తీర్పు వచ్చిన వెంటనే ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. ఇదిలా ఉండగా, విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుతో నీటి సమస్యలు తలెత్తుతాయన్న ఆందోళనలపై కూడా మంత్రి నారాయణ స్పందించారు. డేటా సెంటర్ల కారణంగా విశాఖలో నీటి సమస్యలు రావని స్పష్టం చేశారు. విశాఖ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పక్కా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ఇక, భోగాపురం వెళ్లే రహదారి మరమ్మతులకు గురైనట్టు తన దృష్టికి రాలేదని మంత్రి నారాయణ అన్నారు. అయితే రహదారి పరిస్థితిపై పరిశీలన చేస్తామని చెప్పారు.

