NTV Telugu Site icon

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి చుక్కెదురు..

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు కోర్టులో చుక్కెదురైంది.. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి ఎదురు దెబ్బ తగిలింది.. వంశీ బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం.. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రాసుక్యూషన్ తరపు వాదనలను తాము పరిగణనలోకి తీసుకోలేదన్న న్యాయస్థానం… సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో ఐవోకు, ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.. అయితే, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో గురువారం రోజు విజయవాడ 12 అదనపు సెషన్స్‌ కోర్టు.. వల్లబనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చగా.. ఈ రోజు సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో ఆయన బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది..

Read Also: KTR : ఈ అవివేకపు విధానాన్ని వెంటనే విరమించుకోవాలి

అయితే, గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ విజయవాడ 12 అదనపు డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు వల్లభనేని వంశీ.. అయితే, ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. వంశీ పిటిషన్ డిస్మిస్ చేసిన విషయం విదితమే.. ఇక, గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి కేసులో వల్లభనేని వంశీ మోహన్‌ ఏ71గా ఉన్నారు.. అయితే, వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్ పై మంగళవారం రోజు కోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని.. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టులో సీఐడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించగా.. వంశీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, మానవతా కోణంలో బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టులో విన్నవించారు.. అయితే, గురువారం రోజు ఆ బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్‌ చేసిన విషయం తెలిసిందే.. కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సత్యవర్ధన్‌ను కిడ్నాప్‌ చేసి బెదిరించినట్లు నమోదైన కేసులో వల్లభనేని వంశీని ఫిబ్రవరి 13వ తేదీన అరెస్ట్‌ చేశారు విజయవాడ పటమట పోలీసులు.. హైదరాబాద్‌ రాయదుర్గంలోని మైహోం భుజాలో నివాసం ఉంటున్న వంశీని.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి.. ఆ తర్వాత అరెస్ట్‌ చేసి.. విజయవాడ తీసుకెళ్లిన విషయం విదితమే.. ఇక, కిడ్నాప్‌, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బీఎన్‌ఎస్‌ తదితర సెక్షన్ల కింద వంశీపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి రిమాండ్‌ను మరోసారి పొడిగించింది కోర్టు.. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి రిమాండ్‌ను ఏప్రిల్ 9వ తేదీ వరకు పొడిగించింది కోర్టు.. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇవాళ్టితో ముగిసింది వల్లభనేని వంశీ రిమాండ్.. దీంతో, జిల్లా జైలు నుంచి వల్లభనేని వంశీని కోర్టుకు తీసుకెళ్లారు గన్నవరం పోలీసులు.