Rowdy-Sheeters in Ration Mafia: రేషన్ మాఫియాలోకి రౌడీషీటర్ల ఎంట్రీ.. సంచలన విషయాలు బయటపెట్టిన విజిలెన్స్..

  • కృష్ణాజిల్లాలో రేషన్ మాఫియాలోకి రౌడీ షీటర్ల ఎంట్రీ ..
  • రేషన్ మాఫియాకు రౌడీ షీటర్లు అండగా ఉంటున్నట్టు గుర్తించిన విజిలెన్స్..
  • రేషన్ అక్రమ రవాణా చేస్తున్న నరేంద్ర అనే వ్యక్తి అరెస్ట్..
Ration Mafia

Ration Mafia

Rowdy-Sheeters in Ration Mafia: రేషన్‌ మాఫియా ఇప్పటికే చుక్కలు చూపిస్తోంది.. గత ప్రభుత్వ హయాంలో రేషన్‌ మాఫియా రెచ్చిపోయిందని.. కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, కృష్ణా జిల్లాలో రేషన్ మాఫియాలో కొత్త ఎత్తుగడలు వెలుగులోకి వచ్చాయి. అక్రమంగా పీడీఎస్‌ (PDS) బియ్యం రవాణా చేసేందుకు రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లను అండగా తీసుకుంటున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మాఫియాపై దాడులు చేయడం, కేసుల నమోదులో వేగం పెంచారు.. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో నరేంద్ర అనే వ్యక్తిని అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతని కార్యకలాపాలకు రౌడీ షీటర్లు అండగా ఉన్నట్లు విచారణలో బయటపడింది.

Read Also: Janhvi Kapoor : ఆ విషయంలో జాన్వీ‌కి సపోర్ట్ చేస్తూ.. ప్రియాంక పోస్ట్ వైరల్!

ఇక, నరేంద్రతో కలిసి పనిచేస్తున్న మాజీ రౌడీషీటర్ రూపు మరియు చంద్రబాబు ఇంటి వద్ద దాడి కేసులో నిందితుడైన దుర్గాప్రసాద్ కార్యకలాపాలపై కూడా కేసులు నమోదు చేసినట్లు సమాచారం. వీరిద్దరూ కూడా PDS బియ్యం అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. పెనమలూరు ప్రాంతంలో PDS రేషన్ మాఫియాకు రౌడీ షీటర్ మహేష్ అండగా ఉన్నట్టు విజిలెన్స్ గుర్తించింది. ఈ వ్యవహారంపై కృష్ణలంక పోలీసులు మహేష్‌పై కేసు నమోదు చేశారు. ఒక్కో ప్రాంతంలో రేషన్ అక్రమ రవాణాకు రౌడీ షీటర్లను జత కలుపుతున్న పెద్ద నెట్‌వర్క్ పనిచేస్తోందని విజిలెన్స్ చెబుతోంది. ఈ నెట్‌వర్క్‌కు “ప్రొటెక్షన్”గా రౌడీ షీటర్స్ వ్యవహరిస్తూ ఉన్నారు. దీంతో మాఫియా మరింత బలపడుతోంది. దీనిని అదుపులోకి తేవడానికి అధికారులు ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. పెనమలూరులో నిర్వహించిన దాడుల్లో మొత్తం 3 టన్నుల అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ పట్టివేతతో మాఫియా కార్యకలాపాలు భారీగా బయటపడ్డాయి.