Site icon NTV Telugu

V Srinivasa Rao: డీలిమిటేషన్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభ‌జ‌న హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..

V Srinivasa Rao

V Srinivasa Rao

V Srinivasa Rao: డీలిమిటేషన్ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేంద్రంలోని NDA ప్రభుత్వంపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లో ఆమోదం పొందినప్పుడు డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా వెంటనే అమలు చేయాలని అప్పట్లో టీడీపీ ఎంపీలు కూడా కోరిన విషయాన్ని గుర్తు చేశారు. తాము అయితే 2029 నుంచే మహిళా బిల్లు అమలు చేయాలని స్పష్టం చేశామని తెలిపారు.

Read Also: Kash Patel: కాష్ పటేల్ అతిగా మద్యం సేవిస్తారంటూ కథనం.. రూ.2300 కోట్లు దావా వేసిన ఎఫ్‌బీఐ డైరెక్టర్

జనాభా లెక్కలు జరిగితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సీట్లు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అయితే డీలిమిటేషన్ తర్వాత సీట్లు 50 శాతం పెరుగుతాయని చంద్రబాబు చెబుతున్నారని, అది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని విమర్శించారు శ్రీనివాసరావు.. రాష్ట్ర విభజన హామీల ప్రకారం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు 225 సీట్లు పెరగాల్సి ఉందని, ఇప్పుడు మరోసారి డీలిమిటేషన్ జరిగితే అదనంగా 83 స్థానాలు పెరిగే అవకాశం ఉందన్నారు. న్యాయంగా రావాల్సిన సుమారు 75 స్థానాలను రాష్ట్రం కోల్పోతుందని వ్యాఖ్యానించారు.

ఇక, మహిళా బిల్లు ఆమోదం జరగదని బీజేపీకి ముందే తెలుసని, అందుకే రాజకీయ లాభం కోసం ఈ అంశాన్ని ఉపయోగించుకుందని ఆరోపించారు సీపీఎం ఏపీ కార్యదర్శి… పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు ర్యాలీలు నిర్వహించడం విచారకరమన్నారు. మరోవైపు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడటం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని కూడా వ్యాఖ్యానించారు. పార్లమెంట్ నిర్ణయాన్ని వ్యతిరేకించేలా ప్రధాని మాట్లాడారని ఆరోపించారు.

మరోవైపు, సీపీఐ రాష్ట్ర మహిళా నేత వనజ మాట్లాడుతూ, మహిళా బిల్లు ఇప్పటికే 2023లో ఆమోదం పొందిందని, రాష్ట్రపతి సంతకం కూడా జరిగిందని తెలిపారు. అయితే తాజాగా వచ్చిన మూడు బిల్లుల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఎక్కడా లేదని విమర్శించారు. 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు లోక్‌సభలోకి రాకుండా బీజేపీ అడ్డుకుందని ఆమె ఆరోపించారు. మొత్తం మీద సామాజిక న్యాయం, మహిళల హక్కుల విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వామపక్ష నేతలు మండిపడ్డారు.

Exit mobile version