CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.. బెజవాడలోని ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్లో క్రిటికల్ కేర్ బ్లాక్, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ను కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. 2047 నాటికి దేశం, రాష్ట్రం నంబర్ వన్గా నిలిచేలా అందరూ దేశభక్తితో పనిచేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ నేతృత్వంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని అన్నారు. కేంద్ర సహకారం, రాష్ట్ర భాగస్వామ్యం, ప్రజల సహకారం కలిస్తే ఆంధ్రప్రదేశ్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
ఆరోగ్య రంగంలో కీలక మార్పులు
రాష్ట్రంలో మొత్తం 10 క్రిటికల్ కేర్ బ్లాక్లను ప్రారంభించామని చంద్రబాబు తెలిపారు. వీటి ద్వారా వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని అన్నారు. సంజీవని ప్రాజెక్ట్ దేశానికి గేమ్చేంజర్గా మారుతుందని పేర్కొన్నారు. వచ్చే జనవరి 1 నుంచి రాష్ట్రంలోని అన్ని మెడికల్ రికార్డులను డిజిటలైజేషన్ చేస్తామని వెల్లడించారు. ప్రపంచానికి వ్యాక్సిన్ అందించి ప్రజల ప్రాణాలను కాపాడిన ఘనత భారత్కు దక్కిందని చంద్రబాబు అన్నారు. దేశవ్యాప్తంగా 1.8 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా గ్రామస్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. 780 మెడికల్ కాలేజీలకు సంఖ్యను పెంచి, వైద్య విద్య సీట్లను రెట్టింపు చేశారని చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్ దేశంలోనే నంబర్ వన్గా తయారైందని పేర్కొన్నారు.
అమరావతి టెక్నాలజీ హబ్గా..
భవిష్యత్తులో అమరావతి గురించి ప్రపంచం మాట్లాడుకునే స్థాయికి తీసుకెళ్తామని సీఎం చంద్రబాబు అన్నారు. డిసెంబర్ 1 నుంచి అమరావతిలో తొలి క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థ పనిచేయనుందని తెలిపారు. అమరావతి క్వాంటం బయో వ్యాలీని కూడా ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో డీప్ టెక్నాలజీని అన్ని రంగాల్లోకి తీసుకొస్తామని చెప్పారు. ఫార్మా రంగానికి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారుతుందని, మెడ్టెక్ పార్క్ రాష్ట్రంలో ఉందని అన్నారు.
పోలవరం, ఆర్థిక వృద్ధిపై దృష్టి
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ విలువ 11.1 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరిందని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ వచ్చే సంవత్సరానికి పూర్తవుతుందని అన్నారు. వచ్చే ఏడాది నుంచి ఎల్నినో ప్రభావాన్ని అధిగమించేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
అమరావతి బెస్ట్ సిటీగా..
2035లో జరగబోయే ఒలింపిక్ గేమ్స్కు అమరావతి అత్యుత్తమ నగరంగా నిలిచేలా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఆధునిక మౌలిక వసతులతో పాటు డీప్ టెక్నాలజీ, ఆరోగ్యం, ఫార్మా, మెడ్టెక్ రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న జేపీ నడ్డా కెమికల్ ఫెర్టిలైజర్స్తో పాటు ఆరోగ్య శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక, ప్రతి ఒక్కరికీ యోగా, ప్రాణాయామం, ధ్యానం ఎంతో ముఖ్యమని చంద్రబాబు అన్నారు. విద్యార్థులు ‘హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్’ నిర్మాణానికి సారథులుగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశభక్తితో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

