PVN Madhav Profile: పీవీఎన్‌ మాధవ్‌ నేపథ్యం ఇదే.. అరుదైన రికార్డు..!

  • ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న పీవీఎన్‌ మాధవ్‌..
  • ఉమ్మడి ఏపీలో బీజేపీ చీఫ్ గా పనిచేసిన మాధవ్ తండ్రి చలపతిరావు..
  • తండ్రీ కొడుకులిద్దరూ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేసిన అరుదైన రికార్డు..!
Pvn Madhav

Pvn Madhav

PVN Madhav Profile: ఆంధ్రప్రదేశ్‌ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది.. అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో, పార్టీ విధేయులకు బీజేపీ పెద్దపీట వేస్తోందని మరోసారి రుజువైంది.. దశాబ్దాలు తరబడి పార్టీని నమ్ముకున్న వారికే పదవులు కట్టబెట్టుతోంది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల అధ్యక్షులను ఎంపిక చేసింది. రాష్ట్ర నేతలు ఒకటి తలిస్తే.. హైకమాండ్‌ మరొకటి చేస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్‌, అటు తెలంగాణ అధ్యక్షుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సీనియర్లు, ఆశావహులకు షాకిస్తూ.. కొత్త అధ్యక్షులను ఎంపిక చేసింది.

Read Also: Kothapallilo Okappudu : డైరెక్టర్ గా మారిన కేర్ ఆఫ్ కంచరపాలెం నటి, నిర్మాత

ఇక, మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌ తండ్రి చలపతిరావు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. ఇప్పుడు మాధవ్ అధ్యక్ష బాధ్యతలు చేపడితే.. తండ్రీ కొడుకులిద్దరూ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేసినట్లవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇదో రికార్డు. మాధవ్ తండ్రి చలపతిరావు.. కాషాయ పార్టీకి తొలితరం నాయకుల్లో ఒకరు. ఆయన ఎమ్మెల్సీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొలి బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఉన్న బీజేపీ సీనియర్ నేతలకు చలపతిరావు గురువులాంటి వారు.

Read Also: Kannappa: కన్నప్ప’లో ఎవరెవరికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారంటే?

పీవీఎన్‌ మాధవ్‌ పూర్తి పేరు పోకల వంశీ నాగేంద్ర మాధవ్. 1973 ఆగష్టు 10వ తేదీన.. విశాఖ జిల్లా మద్దిలపాలెంలో జన్మించారు. మాధవ్ ఉన్నత విద్యావంతుడు. కాస్ట్ అకౌంటెంట్ కోర్సు చేశారు. తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో MBA చదివారు. ఏకకాలంలో PGDCS, PGDAS పూర్తి చేశారు. ఆయన రాజకీయ ప్రయాణం అఖిల భారత్‌ విద్యార్థి పరిషత్‌తో ప్రారంభమైంది. చిన్నప్పటి నుంచి రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్‌లో చురుకుగా వ్యవహరించారు. విద్యార్ధి నాయకుడుగా కెరీర్ ప్రారంభించిన మాధవ్.. యువ మోర్చాలో విద్యార్ధి, సామాజిక అంశాలపై పోరాటం సాగించారు. ఆయన కుటుంబానికి రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌తో పాటు బీజేపీతో విడదీయరాని అనుబంధం ఉంది.

Read Also: AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరి అరెస్ట్..!

బీసీ సామాజిక వర్గానికి చెందిన పీవీఎన్‌ మాధవ్.. 2009లో తొలిసారి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2017లో టీడీపీ-బీజేపీ-జనసేన బలపరచడంతో… ఉత్తరాంధ్ర జిల్లాల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించడంతో… శాసనమండలిలో తొలిసారి అడుగుపెట్టారు. ద్వితీయ ప్రాధాన్యత ఓటులో మాధవ్ గెలుపు సాధ్యం అయింది. బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌గానూ పని చేశారు. ఆరేళ్లపాటు ఎమ్మెల్సీగా పనిచేసిన మాధవ్.. పార్టీకి నమ్మకస్తుడు. మాధవ్ పేరు అధ్యక్ష పీఠం కోసం గతంలో పరిశీలించినప్పటికీ సాధ్యం కాలేదు. ఈ సారి ఉత్తరాంధ్రకు ప్రాధాన్యత, బీసీ ఫ్యాక్టర్ వంటివి కలిసి వచ్చాయి. మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యత అధ్యక్ష బాధ్యతలు చేపడితే తండ్రీకొడుకులు ఇద్దరు ఒకే పార్టీకి సారధులుగా పనిచేసిన అరుదైన నేపథ్యం.