NTV Telugu Site icon

Vijayawada: విషాదం.. హోటల్ కిటికీ నుంచి పడి నాలుగేళ్ల చిన్నారి మృతి

Vijayawada

Vijayawada

దుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఓ కుటుంబానికి తీరని లోటు కలిగింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె మృతి చెందడంతో.. ఆ తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. హాయిగా విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లి తిరిగి వస్తున్న ఆ కుటుంబం… తీవ్ర దు:ఖ సాగరంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళ్తే… విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. హోటల్ కిటికీ నుంచి పడి నాలుగేళ్ల చిన్నారి (రుహిక) మృతి చెందింది. గతరాత్రి బద్రీ నాగరాజు కుటుంబం హోటల్ మినర్వా గ్రాండ్‌లో బసచేసింది. అయితే.. వారు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం కోసమని, విశాఖ నుంచి బయల్దేరి శ్రీశైలం వెళ్లి అక్కడ దేవుడిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో విజయవాడకు వచ్చారు. బెజవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న కనక దుర్గను దర్శించుకునేందుకు.. హోటల్ మినర్వా గ్రాండ్‌లో దిగారు. అయితే.. ఈరోజు కనక దుర్గ అమ్మవారిని దర్శించుకుని విశాఖ వెళ్లాలనుకుని భావించిన ఆ కుటుంబానికి తీవ్ర విషాదం మిగిలింది.

Read Also: AP Government: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లోకి పాత జీవోలు..!

ఈరోజు ఉదయం తన అన్నతో కలిసి దొంగ పోలీస్ ఆట ఆడుతున్న క్రమంలో చిన్నారి రుహిక.. దాక్కోవానికి కిటికీ తలుపు తెరిచింది. ఈ క్రమంలో నాల్గవ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కాలు జారిపడి చిన్నారి మృతి చెందింది. మరో గంటలో హోటల్ రూమ్‌ను చెక్ అవుట్ చేస్తారనే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. తమ కళ్ల ముందే కూతురు చనిపోవడంతో నాగరాజు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు. సీఐ ప్రకాష్ మాట్లాడుతూ..
పాప కిటికీలోంచి పడిపోయేటప్పుడు ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారని అన్నారు. వారు హౌస్ కీపింగ్ వర్క్ చేస్తున్నారని తెలిపారు. కాపాడేందుకు పరుగు పరుగున వచ్చినప్పటికీ అప్పటికే పాప కింద పడిపోయిందని పేర్కొన్నారు.