విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వైసీపీ ఎంపీ నందిగం సురేష్ హల్చల్ ఎపిసోడ్లో ట్విస్ట్ నెలకొంది. నందిగం సురేష్ అనుచరుల పై ఇన్స్పెక్టర్ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ బయట, లోపల ఎంపీ అనుచరులపై దుర్భాషలాడుతూ ఇన్స్పెక్టర్ చేయి చేసుకున్నట్లు వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఎంపీ సురేష్ అనుచరులపై ఇన్స్పెక్టరే చేయి చేసుకున్నట్లు వీడియోల్లో వెల్లడైంది. తమపై చేయి చేసుకోవటం వల్లే అర్థరాత్రి పోలీస్ స్టేషన్కు వచ్చామని బాధితులు వాపోతున్నారు.
ఇన్స్పెక్టర్ మిమ్మల్ని కారణం లేకుండా కొట్టారని.. టిఫిన్ చేయటానికి వచ్చామని చెప్పినా ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడారని బాధితుడు మహేష్ తెలిపాడు. స్టేషన్లో బూటు కాళ్ళతో తన్నారని ఆరోపించాడు. పోలీసులు తమ ఫోన్లు లాక్కుని వీడియోలు డిలీట్ చేశారన్నాడు. ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు తమపై దాడి చేసి బండి తాళాలు ఇన్స్పెక్టర్కు ఇచ్చారన్నారు. ఫోన్లో తాము దెబ్బలు తింటున్న సౌండ్ విని ఎంపీ సురేష్ వచ్చారని.. ఆయన వచ్చినా ఇన్స్పెక్టర్ ఖాతరు చేయకుండా ఎంపీ అయితే ఏంటి అని అమర్యాదగా మాట్లాడారని బాధితుడు మహేష్ పేర్కొన్నాడు. కొంత మంది ఎంపీ అనుచరులు పోలీస్ స్టేషన్లో దౌర్జన్యం చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇన్స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్ళు తమను గంట, గంటన్నర పాటు కొట్టారని.. దీంతో రాత్రంతా స్టేషన్లోనే ఉంచారని వివరణ ఇచ్చాడు.
